చంద్రబాబు మమత బెనర్జీల మధ్య రహస్య సమావేశం... ఆ అంశంపైనేనా..?
కోల్కతా: మరో కొద్దిరోజుల్లో లోక్సభ ఎన్నికలు ముగియనుండగా దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ఫ్రంట్ ఏర్పాటుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు వేగవంతం చేస్తుండగా... మరో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పావులు చురుగ్గా కదుపుతున్నారు. తాజాగా బెంగాల్లో బాబు ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. దీదీతో కలిసి చంద్రబాబు అక్కడ ప్రచారం చేశారు. అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సీఎం చంద్రబాబు ఏకాంతంగా సమావేశమై చర్చలు జరిపారు.
గురువారం సాయంత్రం ఖరగ్పూర్లో ప్రచారంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం ముగిశాక మమతా బెనర్జీతో 15 నిమిషాలపాటు ఏకాంతంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. మహాగట్భంధన్ భవిష్యత్ కార్యాచరణపై వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. టీడీపీ నేతలు రాహుల్ గాంధీని కలవడంపై కూడా చంద్రబాబు మమతా బెనర్జీలు చర్చించినట్లు టీఎంసీ వర్గాల విశ్వసనీయ సమాచారం. అయితే మహాకూటమిలోని పార్టీలు మే 21న తలపెట్టిన సమావేశానికి మమతా బెనర్జీ హాజరు అవుతారా లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదని టీఎంసీ వర్గాలు తెలిపాయి. అంతేకాదు మే 21న సమావేశం ఉంటుందా లేదా అనేదానిపై కూడా కచ్చితత్వం లేదని సమాచారం. మే 23న సమావేశం జరిగే అవకాశం ఉందని ఆరోజు దీదీ హాజరయ్యే అవకాశం ఉందని టీఎంసీ చెబుతోంది.
ఈ సమావేశంలో వీవీప్యాట్లపై కూడా బాబు,దీదీలు చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ శాతంపై కూడా చర్చించినట్లు సమాచారం. అంతకుముందు ఖరగ్పూర్లో జరిగిన ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు... మమతా బెనర్జీపై ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్రంలో బీజేపీ రాకూడదంటే రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్కు ఓటు వేయాలని అక్కడి ఓటర్లకు బాబు పిలుపునిచ్చారు. అనంతరం సితిలోని తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ బంధోపాధ్యాయ్కు మద్దతుగా చంద్రబాబు ప్రచారం నిర్వహించారు.
ఒకవేళ ఎన్డీఏకు, యూపీఏకు స్పష్టమైన మెజార్టీ రాకుంటే ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకం కానుంది. ఆ పరిస్థితే తలెత్తితే ప్రధాని పదవికి చంద్రబాబు పేరు కూడా వినిపిస్తుండటంతో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ప్రధాని ఎంపికలో టీఎంసీది కీలక పాత్ర పోషించాల్సి వస్తే మమతా బెనర్జీ కూడా ప్రధాని పదవికి రేసులో ఉన్నారన్న సంగతి మరవకూడదు. ఇప్పటికే బీజేపీపై ఉవ్వెత్తున విమర్శలతో ఎగిసి పడుతున్న మమతా బెనర్జీ చూపు ప్రధాని పీఠం వైపు ఉన్నదనే సంకేతాలు వెళుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బీజేపీపై ఎలాగైతే దీదీ విరుచుకుపడుతున్నారో ఛాన్స్ దొరికినప్పుడు కాంగ్రెస్ను కూడా ఆమె వదలడం లేదు.