బెంగళూరులో దేవేగౌడ, కుమారస్వామిని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
Recommended Video
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామిలను కలిశారు. మోడీ ప్రభుత్వానికి, ఎన్డీయేకు వ్యతిరేకంగా చంద్రబాబు పలు జాతీయ పార్టీల నేతలను కలుస్తోన్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఆయన గురువారం బెంగళూరులో దిగారు. దేవేగౌడను, కుమారస్వామిని కలిశారు. చంద్రబాబు వెంట ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, కంభంపాటి రామ్మోహన్ రావు, తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు ఉన్నారు.
చంద్రబాబుకు ప్రశంసలు
2019లో మోడీని, ఎన్డీయే కూటమిని కలిసి కట్టుగా ఎదుర్కొనే ఉద్దేశ్యంలో భాగంగా చంద్రబాబు పలువురు జాతీయస్థాయి నేతలను కలుస్తోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, మాయావతి, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్, దేవేగౌడ తదితరులను కలుస్తున్నారు. అన్ని విపక్షాలను ఏకతాటి పైకి తీసుకు వచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం బెంగళూరులో ల్యాండ్ అయ్యారు. చంద్రబాబు ప్రయత్నాలను డీఎంకే అధినేత స్టాలిన్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితరులు ప్రశంసిస్తున్నారు.
ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండ్రోజుల్లో బెంగళూరుకు
రెండు రోజుల క్రితమే కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. మూడు లోకసభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే, ఇందులో అంతకుముందు రెండు బీజేపీ స్థానాలు కాగా, కాంగ్రెస్ - జేడీఎస్ కూటమివి మూడు. ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక స్థానాన్ని కాంగ్రెస్ - జేడీఎస్ కూటమికి కోల్పోయింది. పైగా ఇక్కడ కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఇదేం అతిపెద్ద షాక్ కాదని చెబుతున్నారు. విపక్షాలు మాత్రం బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ అంటున్నారు. ఫలితాలు వచ్చిన రెండ్రోజుల్లో చంద్రబాబు బెంగళూరుకు రావడంగమనార్హం.
మాయావతితో దేవేగౌడ మంతనాలు
మాజీ ప్రధాని దేవేగౌడ బీఎస్పీ అధినేత్రి మాయావతితో మహాదిగ్బంధన్ గురించి చర్చిస్తున్నారని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్లు పొత్తుతో వెళ్లేందుకు ఇతర పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కాకుండా ఒంటరి పోరుపై మాయావతిని చంద్రబాబు అడిగారు. అందరం కలిసి కట్టుగా వెళ్తామని చంద్రబాబు చెప్పడంతో పాటు ఇప్పుడు దేవేగౌడ కూడా ఆమెతో మాట్లాడుతున్నారు.
స్టాలిన్తోను భేటీ
గురువారం దేవేగౌడ, కుమారస్వామితో కీలక చర్చలు జరిపిన చంద్రబాబు నాయుడు శుక్రవారం డీఎంకే అధినేత స్టాలిన్కు కూడా కలిసే అవకాశముంది. ఇప్పటికే చంద్రబాబు ప్రయత్నాలపై స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా కూటమి ప్రయత్నాల్లో ఉన్నారు. బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు చంద్రబాబు సహా మిగిలిన నాయకులు అందరూ ఏకతాటిపైకి వచ్చేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారు.