తమిళ సీఎంకు చంద్రబాబు లేఖ, ఏపీకి వెంకయ్య మద్దతు, వైకో అరెస్ట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు శుక్రవారం నాడు లేఖ రాశారు. శేషాచలం ఎన్కౌంటర్ ఘటన పైన విచారణకు ఆదేశించామని చెప్పారు. నివేదిక రాగానే వివరాలు సమర్పిస్తామని తమిళనాడు సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఐదు రోజుల క్రితం మంగళవారం నాడు శేషాచలం ఎన్కౌంటర్ ఘటనలో తమిళనాడుకు చెందిన కూలీలు, స్మగ్లర్లు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమిళ పార్టీలు అన్నీ ఏపీ ప్రభుత్వం, పోలీసుల పైన భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు లేఖ రాశారు.
చంద్రబాబుకు వెంకయ్య అండ
శేషాచలం ఎన్కౌంటర్ ఘటన పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వేరుగా స్పందించారు. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. శేషాచలం అడవుల్లోకి స్మగ్లర్లు, కూలీలు వెళ్లడంపై స్పందిస్తూ.. నిషేధిత ప్రాంతంలోకి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి ఉండదన్నారు. వెంకయ్య వ్యాఖ్యలు ఏపీకి మద్దతుగా ఉన్నాయని చెబుతున్నారు.
శేషాచలం ఎన్కౌంటర్పై మృతులకు శవపరీక్షపై హైకోర్టులో వ్యాజ్యం
శేషాచలం ఎన్కౌంటర్ మృతులకు శవపరీక్ష పైన మద్రాస్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఆరు మృతదేహాలకు మరోసారి శవపరీక్షలు నిర్వహించాలని వ్యాజ్యంలో కోరారు. దానిని విచారించిన కోర్టు, శవపరీక్షల విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పినట్లుగా సమాచారం. ఏపీ హైకోర్టులో వ్యాజ్యం ఉన్నందున అవసరమైతే ఇంప్లీడ్ అవ్వాలని సూచించింది.
వైకోను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఎన్కౌంటర్ ఘటన పైన వైకో నిరసన నేపథ్యంలో సరిహద్దులో భారీ భద్రతను ఉంచారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి వైకో పిలుపునిచ్చారు. వెల్లూరు నుండి చిత్తూరుకు వైకో ప్రదర్శనగా బయలుదేరారు.
ఈ నిరసన ప్రదర్శనలో వందలాది మంది పాల్గొన్నారు. అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడు - ఏపీ సరిహద్దులో పోలీసులను బారీగా మోహరించారు. పోలీసులు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వైకోను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వేలూరులోనే అతనిని అదుపులోకి తీసుకున్నారు.