కార్యశీలి: రమణ్, చూశా... అద్భుతం: బాబు (పిక్చర్స్)
రాయపూర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కలిసి నయా రాయపూర్లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. సోమవారం సాయంత్రం వారిద్దరు ఓ హోటల్లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు.నయా రాయపూర్కు అన్ని రవాణా సౌకర్యాలు కల్పించామని రమణ్ సింగ్ చెప్పారు. పారిశ్రామికవేత్తలతో చంద్రబాబుతో పాటు సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పరస్పర సహకారానికి జాయింట్ టాస్క్పోర్స్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. చంద్రబాబు కార్యదక్షుడని ఆయన ప్రశంసించారు. నయా రాయపూర్ నిర్మాణానికి భూసేకరణ జరిపిన తీరును పరిశీలించినట్లు చంద్రబాబు మీడియాతో చెప్పారు. రైతులకు ఇబ్బంది కలగకుండా రాజధాని నిర్మాణానికి భూసేకరణ ఎలా జరపారో తెలుసుకున్నట్లు చెప్పారు. తాము రైతులతో పాటు ఇతర వర్గాలకు ఇబ్బంది కలగకుండా ఎపి రాజధాని నిర్మాణానికి భూసేకర చేస్తామని ఆయన చెప్పారు.
ఛత్తీస్గడ్ ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన చెప్పారు. కొత్త రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని ఆయన చెప్పారు. వివిధ రంగాల్లో రెండు ప్రభుత్వాలు సహకరించుకుంటాయని ఆయన చెప్పారు. విదేశీ పెట్టుబడులను ఛత్తీస్గడ్ ఏర్పాటైనప్పుడు ఎలా ఆకర్షించారనేది తాను అధ్యయనం చేసినట్లు చంద్రబాబు తెలిపారు. రాయపూర్ను అభివృద్ధి చేసిన తీరును పరిశీంచామని ఆయన అన్నారు. కొద్ది కాలంలోనే రాయపూర్ అభివృద్ధి చెందిందని ఆయన ప్రశంసించారు.
ఎపి, ఛత్తీస్గడ్ మధ్య రోడ్డు, ఇతర రవాణా సౌకర్యాల ఏర్పాటుపై చర్చించామని ఆయన చెప్పారు. అన్ని వ్యవస్థల్లో సాంకేతిక పరిజ్జానాన్ని వినియోగించుకోవడం ద్వారా చత్తీస్గడ్లో అవినీతిని అరికట్టారని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీ అభివృద్ధి నమూనాను ఆయన ప్రశంసించారు. అన్ని అంశాలపై చర్చలు ఫలవంతమయ్యాయని ఆయన చెప్పారు. ఎపి కొత్త రాజధాని ఏర్పాటుపై పలు ప్రదేశాలను పరిశీలిస్తున్నట్లు చంద్దరబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో చర్చించినట్లు ఆయన తెలిపారు. అవకాశాలు చాలా ఉన్నాయని, వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేదే ముఖ్యమని ఆయన అన్నారు. ఐటి అభివృద్ధి గురించి తాను మాట్లాడినట్లు చంద్రబాబు తెలిపారు.
రాష్ట్ర విభజన అశాస్త్రియంగా జరిగిందని ఆయన విమర్శించారు. వివిధ రంగాల్లో హేతుబద్ధత లోపించిందని ఆయన అన్నారు. మీడియాతో తనకు సమస్య లేదని, మీడియాతో స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయని ఆయన అన్నారు.
పారిశ్రామికవేత్తలతో సిఎంలు
నయా రాయపూర్లోని ఓ హోటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సమావేశమయ్యారు.
ఎపిలో పరిశ్రమలకు ప్రోత్సాహం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే అవకాశం ఉంది.
రమణ్ సింగ్కు సత్కారం
చంద్రబాబు నాయుడు రమణ్ సింగ్కు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి సత్కరించారు. ఇద్దరు సిఎంలు ఇలా కనిపించారు.
పోలవరంపై చర్చ
పోలవరం ప్రాజెక్టుపై నారా చంద్రబాబు నాయుడు రమణ్ సింగ్ చర్చించారు. ఇతర విషయాలపై కూడా చర్చ సాగింది.
ప్రజా పంపిణీ వ్యవస్థపై..
నయా రాయపూర్లోని ప్రజా పంపిణీ వ్యవస్థపై, నూతన భవనాల నిర్మాణాలను చంద్రబాబు పరిశీలించారు.
ఎపి, ఛత్తీస్గడ్ అవకాశాల పరిశీలన
ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు ఏమిటి, ఛత్తీస్గడ్లో ఉన్న అవకాశాలు ఏమిటనేది తాము పరిశీలించినట్లు రమణ్ సింగ్ మీడియా సమావేశంలో చెప్పారు.