టాటా గ్రూపులో భారీ మార్పులు: పునర్వ్యవస్థీకరణకు చంద్రశేఖరన్ సిద్దం.. ఇదీ ప్లాన్?
కంపెనీ లాభాలను పెంచడం కోసం టాటా బ్రాండ్లను బలోపేతం చేయాలని భావిస్తున్న చంద్రశేఖరన్.. పునర్వ్యవస్థీకరణే సరైన మార్గమని నమ్ముతున్నారు.
ముంబై: టాటా గ్రూప్ చైర్మన్గా చంద్రశేఖరన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ సంస్థను పునర్వ్వవస్థీకరించే పనిలో తలమునకలయ్యారు. సంస్థలో 100కి పైగా ఉన్న కంపెనీల విషయంలో పర్యవేక్షణ కొరవడుతోందని భావిస్తున్న యాజమాన్యం.. త్వరలోనే భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది.
ఈ మేరకు టెక్ కంపెనీలన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే యోచనలో ఉన్నారు. అలాగే ఇన్ఫ్రా రంగంలోని టాటా కంపెనీలన్నింటిని ఒక్కటి చేసే ఆలోచనలో ఉన్నారు. కంపెనీ లాభాలను పెంచడం కోసం టాటా బ్రాండ్లను బలోపేతం చేయాలని భావిస్తున్న చంద్రశేఖరన్.. పునర్వ్యవస్థీకరణే సరైన మార్గమని నమ్ముతున్నారు.
టీసీఎస్ గొడుగు కిందకు:
టాటాగ్రూప్ పునర్వ్యవస్థీకరణకు.. 'టెక్నాలజీ' కంపెనీలతో శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని కంపెనీలన్నింటిని టీసీఎస్ గొడుగు కిందకు తీసుకురావాలని యోచిస్తున్నారు. టీసీఎస్ లో ఇమడలేని కంపెనీలను విక్రయించాలనే ప్రయత్నంలో కూడా ఉన్నారు. కంపెనీల సంఖ్య పెరిగిపోవడంతో.. పర్యవేక్షణ కష్టంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ఇంకా ఫైనల్ కాలేదు:
టాటా కంపెనీలన్నింటికి టీసీఎస్ కిందకు తీసుకురావాలని భావిస్తున్నప్పటికీ.. ఇప్పటికైతే ఆ కంపెనీలకు సంబంధించిన లిస్టు రెడీ కాలేదని తెలుస్తోంది. తుది నిర్ణయం జరిగితే కానీ దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కాగా, టాటా గ్రూపుకు టీసీఎస్ ఒక అక్షయపాత్ర లాంటిది. టాటా సంస్థకు వస్తున్న మూడు వంతుల లాభాల్లో రెండు వంతులు ఒక్క టీసీఎస్ నుంచే వస్తున్నాయి.
టెక్నాలజీ విభాగంలో టాటా ఎలెక్సీ అనే మరో కంపెనీ కూడా మార్కెట్లో లిస్ట్ అయింది. ఇదే రంగంలో కంప్యూటర్ ఆధారిత లెర్నింగ్ ఉత్పత్తులను విక్రయించే టాటా ఇంటరాక్టివ్ సిస్టమ్స్ తో పాటు టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీస్ పేరుతో ఇంకో కంపెనీ కూడా గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.
ఇన్ఫ్రా కూడా:
ఇన్ఫ్రా రంగంలోని కంపెనీలను కూడా ఒక్కటి చేయాలనే ప్లాన్ లో భాగంగా.. ఏసీలు, ఎయిర్ కూలర్లు, వోల్టాస్ ఇంజనీరింగ్, నీటి శుద్ది ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్న కంపెనీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్లు, రైల్వేలు, విద్యుత్ పంపిణీ నెట్ వర్క్ విభాగాల్లో ఉన్న కంపెనీలను కూడా ఇందులో చేర్చనున్నారు.
చంద్రశేఖరన్ ముద్ర:
టాటా చైర్మన్ గా తనదైన ముద్రవేసే ఆలోచనలో భాగంగా చంద్రశేఖరన్ ఈ పునర్వ్యవస్థీకరణ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. రాబడులను నిష్పత్తిని పెంచడం, దేశీయ వినియోగంపై ఫోకస్ చేయడం ద్వారా టాటా ఉత్పత్తుల విలువ పెంచాలని ఆయన భావిస్తున్నారు.
కాగా, గ్రూప్ కంపెనీల్లో ఒక కంపెనీ వాటాలు మరో కంపెనీలో కలిగి ఉండగా.. ఆ వాటాలను కూడా ప్రమోటర్లు కొనుగోలు చేయాలనేది ప్రణాళికలో భాగంగా తెలుస్తోంది. మొత్తానికి కంపెనీల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన చర్చలు మొదలుకావడంతో త్వరలోనే వీటన్నంటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.