రైతులకు భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్,ఎంపీ పప్పు యాదవ్ మద్దతు... షాహీన్ బాగ్ దాదీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఆరు రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు మహా ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం(డిసెంబర్ 1) షాహీన్ బాగ్ దాదీ బిల్కిస్ బనో,దళిత నాయకులు చంద్రశేఖర్ ఆజాద్,పప్పు యాదవ్ రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఘాజిపూర్ సరిహద్దులో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్,ఎంపీ పప్పు యాదవ్ రైతులను కలుసుకున్నారు. షాహీన్ బాగ్ దాదీ బిల్కిస్ బనోని మాత్రం పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.
రైతులకు సంఘీభావం ప్రకటించిన సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ మీడియాతో మాట్లాడారు. రైతులపై భాష్ప వాయువు,వాటర్ క్యాన్లను ప్రయోగించడాన్ని ఆజాద్ తీవ్రంగా తప్పు పట్టారు. రైతు ఉద్యమంతో కేంద్రానికి భయం పట్టుకుందని... అందుకే ఉద్యమాన్ని అణచివేసేందుకు లాఠీచార్జీలు,టియర్ గ్యాస్లు ప్రయోగిస్తోందని ఆరోపించారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల భూములను కూడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం పూనుకుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆజాద్ మద్దతుదారులు కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఎంపీ పప్పు యాదవ్ కూడా రైతులను కలుసుకుని వారికి మద్దతు ప్రకటించారు. కేంద్రం ప్రభుత్వం ఇకనైనా ఆ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం పంజాబ్ రైతుల సమస్య మాత్రమే కాదని... దేశంలోని ప్రతీ రైతు సమస్య అని పేర్కొన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.
Recommended Video
షాహీన్ బాగ్ దాదీగా గుర్తింపు తెచ్చుకున్న వృద్దురాలు బిల్కిస్ బనో మాట్లాడుతూ... 'మేము రైతు బిడ్డలం. ఈరోజు రైతుల వద్దకు వెళ్లి వారి ఉద్యమానికి మద్దతు తెలుపుతాం. వాళ్ల తరుపున కేంద్రానికి మా గొంతుకను వినిపిస్తాం.' అని పేర్కొన్నారు. అయితే బిల్కిస్ను పోలీసులు సింఘూ సరిహద్దు వద్ద అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి ఎస్కార్ట్ వాహనంలో ఆమె ఇంటికి తరలించారు. బిల్కిస్ వయసు రీత్యా కోవిడ్ 19 దృష్టిలో పెట్టుకుని ఆమెని అక్కడికి అనుమతించలేదని పోలీసులు తెలిపారు.