ఎవరీ చంద్రస్వామి?: దావూద్ నుంచి పీవి వరకు.. ఆయన చెప్పిందే చేశారు!
భారతదేశ మాజీ ప్రధానులు పీవి నరసింహరావు, చంద్రశేఖర్ లతో చంద్రస్వామికి అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఈ ఇద్దరు కష్ట సమయాల్లో చాలాసార్లు ఆయన సలహాలు స్వీకరించినవారే.
న్యూఢిల్లీ: మాఫియా గ్యాంగ్ స్టర్స్ నుంచి దేశాధినేతల దాకా.. అంతా ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలని ఆరాటపడేవారు. తాంత్రిక విద్యలో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న ఆయన దర్శనం కోసం వారు తాపత్రయపడేవారు. గడిచిన రెండు దశాబ్దాలుగా ఆయన తన ప్రాభవం కోల్పోయినప్పటికీ.. చరిత్రలో ఆయన ప్రస్థానం ఎప్పుడూ చర్చనీయాంశమే. ఆయనే "చంద్రస్వామి".
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రస్వామి(69) మంగళవారం నాడు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. శరీరంలోని అవయవాలన్ని అచేతనావస్థలోకి వెళ్లిపోవడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతి నేపథ్యంలో ప్రముఖులతో ఆయన సాన్నిహిత్యం మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
ఇంటినుంచి పారిపోయి తాంత్రికుడిగా:
చంద్రస్వామి స్వస్థలం హైదరాబాద్. నిజానికి ఆయన అసలు పేరు కూడా అది కాదు. హైదరాబాద్ లోని ఓ వడ్డీ వ్యాపారి కొడుకైన చంద్రస్వామి అసలు పేరు నేమిచంద్. రాజస్థాన్ లోని బెహ్రోర్ ప్రాంతం నుంచి ఆయన తండ్రి హైదరాబాద్ కు వలస వచ్చారు.
చిన్నతనంలోనే ఇంటినుంచి పారిపోయిన నేమిచంద్.. గోపీనాథ్ కవిరాజ్ అనే తాంత్రికుడి వద్ద విద్య నేర్చుకున్నాడు. తదనంతరం తన పేరు చంద్రస్వామిగా మార్చుకున్నారు. గోపినాథ్ వద్ద శిక్ష ముగించుకుని బీహార్ లోని అడవుల్లో కఠోర తపస్సు ద్వారా సిద్దులకు మాత్రమే సాధ్యమైన విద్యలెన్నో నేర్చుకున్నానని చంద్రస్వామి అప్పట్లో చెప్పేవారు.
ఇద్దరు ప్రధానులతో సాన్నిహిత్యం:
భారతదేశ మాజీ ప్రధానులు పీవి నరసింహరావు, చంద్రశేఖర్ లతో చంద్రస్వామికి అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఈ ఇద్దరు కష్ట సమయాల్లో చాలాసార్లు ఆయన సలహాలు స్వీకరించినవారే. ఆవిధంగా 1980-90 ప్రాంతంలో చంద్రస్వామి పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.
అంతేకాదు, రాజీవ్ గాంధీ హత్యలోను చంద్రస్వామి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడం, ఎల్టీటీఈ ఉగ్రవాదులకు నిధులు చేరవేస్తున్నారన్న వివాదస్పద అంశాల్లోను ఆయన పేరు బలంగానే వినిపించింది. ఎల్టీటీఈకి చంద్రస్వామి నిధులు సమకూర్చారని మిలాప్ చంద్ జైన్ కమిటీ నివేదిక ఇవ్వడంతో, ఆయన విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించారు.
బ్రూనై సుల్తాన్, బ్రిటీష్ ప్రధానిలు సైతం శిష్యులే:
బ్రిటీష్ మాజీ ప్రధాని మార్గరేట్ థాచర్, బ్రూనై సుల్తాన్ లు కూడా చంద్రస్వామి వద్ద సలహాలు స్వీకరించినవారే. 1975లో థాచర్ కార్యాలయానికి చంద్రస్వామి వెళ్లడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. మరో నాలుగేళ్లలో ఆమె ప్రధాని అవుతారని, పదేళ్ల పాటు పదవిలో ఉంటారని ఆయన అప్పట్లో జోస్యం చెప్పారు.
అనంతరం ఆయన చెప్పినట్లుగానే థాచర్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆమె కోటరీలో చంద్రస్వామికి ప్రాముఖ్యత ఏర్పడింది. అటు తర్వాత చాలాసార్లు థాచర్ చంద్రస్వామి సలహాలు స్వీకరించినట్లు చెబుతారు. ఇక బ్రూనై సుల్తాన్ సైతం చంద్రస్వామి వద్ద సలహాలు స్వీకరించినవారే.
దావూద్ ఇబ్రహీం సహా ఎంతోమంది:
చంద్రస్వామి జ్యోతిష్యంపై ప్రముఖుల్లో బలపడిన విశ్వాసం.. ఆయన్ను చాలామందికి దగ్గర చేసింది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సహా బహ్రైన్ కు చెందిన షేక్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్, బ్రిటిష్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్, ఆయుధాల దళారి అద్నాన్ ఖషొగ్గి.. ఇలా చాలామంది ఆయన సలహాల కోసం సంప్రదించేవారు.
పీవి మరణం తర్వాత కనుమరుగు:
ఎక్కడికెళ్లినా ప్రముఖుల చేత నీరజనాలు అందుకున్న చంద్రస్వామి.. పీవి హయాంలోనే ఎక్కువగా ఫోకస్ అయ్యారు. పీవి ప్రధానిగా ఉన్న కాలంలోనే.. ఢిల్లీలో 'విశ్వ ధర్మయాతన్ సనాతన్' అనే ఆశ్రమాన్ని స్థాపించారు. లండన్ కు చెందిన వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులోను, ఫెరా చట్టాలను ఉల్లంఘించిన కేసులో జైలుకు వెళ్లి, జరిమానా కట్టారు. పవీ మరణానంతరం క్రమంగా ఆయన తన ప్రాభవం కోల్పోయారు. ఆపై అనారోగ్యం బారిన పడటంతో మంచానికే పరిమితమయ్యారు. మంగళవారం నాడు ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు.