చంద్రయాన్-1కు 11 ఏళ్లు: ప్రయోగం చివరి నిమిషంలో ఏం జరిగింది..? శాస్త్రవేత్తలు ఏం చెప్పారు?
11 ఏళ్ల క్రితం సరిగ్గా అక్టోబర్ 22వ తేదీ చంద్రమండలంపై భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-1ని చంద్రుడిపైకి పంపించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఇందుకోసం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ-11ను వినియోగించింది.
విజయవంతంగా ముగిసిన ప్రయోగం
చంద్రయాన్-1... భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రయోగం. సరిగ్గా 11 ఏళ్ల క్రితం అంటే 22 అక్టోబర్ 2008న చంద్రుడి వద్దకు చంద్రయాన్-1ను ప్రయోగించి విజయం సాధించి ఇతర ప్రపంచదేశాల సరసన సగర్వంగా నిలిచింది. ప్రపంచ నలుమూలల ఉన్న భారతీయులు సగర్వంగా చెప్పుకున్న రోజు. భారత్ అంతరిక్ష పరిజ్ఞానం ఇతర అగ్రరాజ్యాల పరిజ్ఞానంకు ఏమాత్రం తీసిపోదని నిరూపించిన రోజు. చంద్రయాన్ -1 జీవితకాలం 312 రోజులు. ఆగష్టు 29, 2009 నాటికి చంద్రడిని 3400 సార్లు చుట్టేసింది. ఆ సమయంలో చంద్రమండలంలో ఆవిరి రూపంలో నీటి ఆనవాలను గుర్తించింది. అయితే ఈ ప్రయోగం నల్లురుపై నడకలా సాగలేదు. ఇందుకోసం కొన్ని వందల మంది శాస్త్రవేత్తలు శ్రమించారు.
ప్రయోగం సమయానికి ప్రతికూల వాతావరణం
చంద్రయాన్ -1 ప్రాజెక్ట్ డైరెక్టరుగా పనిచేసిన అన్నాదురై ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చంద్రయాన్-1ను ప్రయోగించేందుకు చాలా తక్కువ సమయం ఉన్నిందని సరిగ్గా ప్రయోగం సమయానికి వాతావరణం కూడా అనుకూలించలేదని గుర్తుచేశారు. లాంచ్కు సమయం దగ్గరపడుతుండగా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయని చెప్పిన అన్నాదురై . ఇక ఒక అరగంటలో వాతావరణం సాధారణ స్థితికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నట్లు చెప్పారు. కాసేపటికే ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైందని అసలు ప్రయోగం జరుగుతుందా లేదా అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో తలెత్తాయని డాక్టర్ అన్నాదురై చెప్పారు.
ఇష్ట దైవానికి ప్రార్థనలు చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు
ప్రయోగంకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో దాదాపు 200 మంది అధికారులు ప్రయోగం అనుకున్న సమయానికే జరగాలంటూ తమ ఇష్ట దైవానికి ప్రార్థించిన క్షణాలు తన కళ్లముందు ఇంకా ఉన్నాయని చెప్పారు. తమ ఇష్ట దైవాలకు సంబంధించిన ఫోటోలు తమ కంప్యూటర్ స్క్రీన్లపై ఉంచినట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ చెప్పారు. కొందరు తిరుపతి తిరుమలేశుడి సన్నిధి నుంచి ప్రసాదం తీసుకొచ్చారని చెప్పారు. అప్పటి వరకు భారత్ ఎప్పుడూ ఇలాంటి ప్రయోగానికి శ్రీకారం చుట్టలేదని చెప్పారు. ఇక ఒక ఉపగ్రహాన్ని 36వేల కిలోమీటర్లను దాటి ట్రాక్ చేయడం అది ఇస్రో చరిత్రలో తొలిసారి అని గుర్తుచేసుకున్నారు డాక్టర్ అన్నాదురై.
చివరి నిమిషంలో చంద్రయాన్-1లో సాంకేతికలోపం
చంద్రయాన్ -1 ప్రయోగంలో చివరి నిమిషంలో సాంకేతికలోపం తలెత్తిందని గుర్తుచేశారు అప్పటి ఇస్రో ఛైర్మెన్ మాధవన్ నాయర్. అయితే సాంకేతిక సమస్యను కనుగొని దాన్ని వెంటనే పరిష్కరించడంతో అనుకున్న సమయానికే చంద్రయాన్ టేకాఫ్ తీసుకుందని చెప్పారు. చంద్రయాన్ 1 లాంచ్కు ముందు ప్రొపెల్లెంట్లో లీకేజీ ఏర్పడిందని మాధవన్ నాయర్ చెప్పారు. మరమత్తులు చేసి అనుకున్న సమయానికే పీఎస్ఎల్వీని లాంచ్ చేసినట్లు మాధవన్ నాయర్ చెప్పారు. 2008 నవంబర్ 8న చంద్రయాన్ -1ను అనుకున్న కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు.
చంద్రయాన్ 1 ఏ విషయాలను కనుగొంది..?
ఇక చంద్రయాన్ -1 నీటి ఆనవాలను ఉత్తర ధృవ ప్రాంతంలో గుర్తించడంతో పాటు చంద్రుడిపై మెగ్నీషియం, అల్లూమినియం, సిలికాన్ వంటి ఖనిజాలను కూడా గుర్తించింది. దీంతో పాటు చంద్రుడి ఫోటోలు కూడా తీసి భూమికి పంపడం ఇస్రో సాధించిన మరో విజయం అన్నారు. చంద్రయాన్ -1 పంపిన సమాచారంతోనే 2014లో మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్)ను విజయవంతంగా ప్రయోగించగలిగినట్లు ఇస్రో మాజీ అధిపతి మాధవన్ నాయర్ చెప్పారు.