చంద్రుడిపై మనిషి మనుగడకు చంద్రయాన్-2 బాటలు వేయనుంది: నాసా మాజీ వ్యోమగామి
న్యూఢిల్లీ: చంద్రుడిపైకి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో పంపిన చంద్రయాన్-2 భారత శాస్త్ర సాంకేతికతను మరో ఎత్తుకు తీసుకెళ్లడమే కాకుండా... అంతరిక్ష పరిశోధనల్లో నిమగ్నమైన అన్ని దేశాల శాస్త్రవేత్తలకు చంద్రుడిపై మనిషి శాశ్వతంగా ఉండేలా పరిశోధనలు చేసేందుకు ఉపకరిస్తుందని చెప్పారు నాసా మాజీ వ్యోమగామి జెర్రీ లినెన్గర్. సెప్టెంబర్ 7న తెల్లవారు జామున 1:30 గంటల నుంచి 2:30 గంటల మధ్య చంద్రయాన్-2 చంద్రుడిపై ల్యాండ్ కానుంది.
చంద్రయాన్-2 ఒక అద్భుతమైన మిషన్ అని ల్యాండింగ్ సమయం కోసం తాను ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నట్లు జెర్రీ లినెన్గర్ తెలిపారు.అంతేకాదు చంద్రయాన్ 2 ల్యాండింగ్ ప్రక్రియను వీక్షించేందుకు భారత్కు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అంతేకాదు లైవ్ బ్రాడ్కాస్ట్కు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు లెనిన్గర్. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు సురక్షితమైన ల్యాండింగ్ చేశాయని అయితే చంద్రుడికి అవతల వైపు అంటే దక్షిణ ధృవ ప్రాంతంలో భారత్ సురక్షితంగా ల్యాండ్ చేయడం నిజంగా ఓ మైలురాయిగా మిగిలిపోతుందని చెప్పారు.
1986 నుంచి 2001 వరకు లినెన్గర్ రష్యా స్పేస్ స్టేషన్ మిర్ నుంచి తక్కువ భూకక్ష్యలో ప్రయాణించారు. దాదాపు 5 నెలల పాటు అంతరిక్షంలో గడిపారు.ఇక నేషనల్ జియోగ్రఫీ ఛానెల్ చంద్రయాన్ -2ను లైవ్ టెలికాస్ట్ చేస్తున్న నేపథ్యంలో అక్కడి నిపుణులకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు భారత్కు వచ్చారు. ఇది శుక్రవారం రాత్రి 11:30 గంటల నుంచి లైవ్ టెలికాస్ట్ ఇవ్వనుంది. భారత్ ప్రయోగిస్తున్న చంద్రయాన్-2 ఎంతో ప్రత్యేకమైనదని లినెన్గర్ చెప్పారు. ఎందుకంటే దక్షిణ ధృవంపై ల్యాండ్ కావడం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంటోందని చెప్పిన ఆయన... దక్షిణ ధృవం వైపున 70 డిగ్రీల అక్షాంశం దిశగా ల్యాండ్ అవుతుంది. అక్కడే గడ్డకట్టిన నీరు ఉండే అవకాశం ఉంది. ఈ విషయం ధృవీకరణ అయితే చంద్రుడిపైకి 2024లో మనిషిని పంపేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.
చంద్రయాన్-2 మిషన్కు సంబంధించిన ఖర్చుపై కూడా ఆరా తీసిన లినెంగర్ మిషన్కు ఖర్చు అయ్యింది కేవలం రూ.978 కోట్లు అని చెప్పగానే ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఎంత తక్కువ ఖర్చు అయితే అన్ని ఎక్కువ మిషన్లను అంతరిక్షంలోకి పంపొచ్చని చెప్పారు. ఇక సెప్టెంబర్ 7 కోసం మొత్తం ప్రపంచ ఎదురు చూస్తోందని ఈ మిషన్లో భాగస్వాములైనవారితో పాటు మొత్తం భారతదేశ ప్రజలు గర్వించదగ్గ రోజు అవుతుందని హర్షం వ్యక్తం చేశారు లినిన్గర్.