జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్-2: సంక్లిష్టదశలో శాస్త్రవేత్తల నైపుణ్యం
బెంగళూరు: జాబిల్లిపై నీటి వనరులను అన్వేషించడానికి భారత అంతిరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో..అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రాయన్-2 మరో ముందడుగు వేసింది. భ కక్ష్యను దాటుకుని, చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఎదురైన ప్రతికూల పరిస్థితులను చంద్రయాన్-2 మిషన్.. అధిగమించడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలానికి 200 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తోందీ స్పేస్ క్రాఫ్ట్. వచ్చేనెల 7వ తేదీన దక్షిణ ధృవం వైపు అడుగు పెట్టబోతోంది.
వైఎస్ జగన్ కు థ్యాంక్స్ చెప్పిన కన్నా: త్వరలో సమావేశమయ్యే ఛాన్స్?
చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ఈ ఉదయం 9:30 గంటల సమయంలో భూకక్ష్యను వీడింది. ఆ వెంటనే- అండాకారంలో ఉన్న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. భూగోళం వైపు నుంచి పరిశీలిస్తే.. ఇది తొలిదశ కక్ష. ఇలా మూడు దశలను ఛేదించుకుని చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ వచ్చేనెల 7వ తేదీన చందమామపై అడుగు మోపుతుంది. అండాకారంలో ఉన్నందున.. ప్రస్తుతం ఈ స్పేస్ క్రాఫ్ట్ 200 కిలోమీటర్ల నుంచి 1500 దూరం వరకు పరిభ్రమిస్తోంది. మలిదశలో ఈ దూరం మరింత తగ్గుతుంది. శుక్రవారం నాటికి రెండో దశ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా- చంద్రుడి ఉపరితలానికి 179 కిలోమీటర్ల నుంచి 1412 కిలోమీటర్ల మధ్య పరిభ్రమిస్తుంది.
ఆదివారం ఈ దూరం మరింత తగ్గుతుంది. 114 నుంచి 128 కిలోమీటర్లకు క్షీణించిపోతుంది. ఇక అదే చివరిదశ. ఆ తరువాత ఇక నేరుగా ల్యాండింగే. చంద్రుడి దక్షిణ ధృవంపై స్పేస్ క్రాఫ్ట్ అడుగు మోపుతుంది. చివరిదశ పరిభ్రమణ సమయంలోనే ఈ స్పేస్ క్రాఫ్ట్ వీడిపోతుంది. విక్రమ్ ల్యాండర్ ను చివరిదశ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత.. దానితో సంబంధాలను కోల్పోతుంది స్పేస్ క్రాఫ్ట్. చందమామకు ఉన్న గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపైకి చేరుకుంటుంది. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు.
కిందటి నెల 22వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణం సజావుగా సాగుతోందని శాస్త్రవేత్తలు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతరిక్షంలోకి వెళ్లిన కొద్దిరోజుల తరువాత భూగోళానికి సంబంధించిన కొన్ని తాజాగా ఫొటోలను పంపించింది. దీనితో- స్పేస్ క్రాఫ్ట్ పనితీరులో ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదని శాస్త్రవేత్తలు నిర్ధారించుకున్నారు. ఇక సాఫ్ట్ ల్యాండింగ్ పై వారు దృష్టి పెట్టారు. వచ్చేనెల 7వ తేదీన చోటు చేసుకునే సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన దశ అని వారంటున్నారు. నిర్దేశిత వేగాన్ని మించి ల్యాండర్ ప్రయాణం సాగిస్తే.. క్రాష్ ల్యాండింగ్ అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.