చంద్రమండలంలోకి చంద్రయాన్-2... ఆగష్టు 20న చంద్రుడి సమీపంకు మిషన్
బెంగళూరు: చంద్రుడిపైకి ఇండియా మిషన్ చంద్రయాన్-2ను భారత్ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన సంగతి తెలిసిందే. బుధవారం రోజున చంద్రయాన్-2 భూకక్ష్యను వీడి చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించినట్లు ఇస్రో తెలిపింది. ఇక భూకక్ష్యను ఆరోసారి పెంచి ఆ తర్వాత చివరిసారిగా మరోసారి పెంచారు శాస్త్రవేత్తలు. ఈ వ్యవహారమంతా బుధవారం తెల్లవారు జామున 2 గంటల 21 నిమిషాలకు చోటుచేసుకుంది.
చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్ -2
ఆగష్టు 14, 2019 చంద్రయాన్ -2 భూకక్ష్యను వీడి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని ఇస్రో ట్వీట్ చేసింది. మరో వారం రోజుల పాటు పయనించి ఆగష్టు 20న చంద్రుడి సమీపంలోకి చంద్రయాన్ -2 చేరుకుంటుంది. ఆ సమయంలో పలుమార్లు కక్ష్య మార్పిడి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. చంద్రయాన్-2 విక్రమ్ అనే ల్యాండర్ను, ప్రగ్యాన్ అనే రోవర్ను తనతో పాటు మోసుకెళ్లింది. చంద్రుడిపై రోవర్ ను అడుగుపెట్టేలా ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగం ఇదే. అయితే సెప్టెంబర్ 7న చంద్రుడిపై చంద్రయాన్-2 ల్యాండ్ అవుతుంది.
ఐదు సార్లు కక్ష్యను పెంచినట్లు తెలిపిన ఇస్రో
ఇక చివరిగా కక్ష్యను పెంపొందించే క్రమంలో ద్రవ ఇంజిన్ను 1203 సెకన్ల వరకు మండించడం జరిగిందని ఇస్రో పేర్కొంది. దీంతో భూకక్ష్యను వీడి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-2 ప్రవేశించిందని ఇస్రో వివరించింది. అంతకు ముందు జూలై 23 నుంచి ఆగష్టు 6వరకు ఐదు సార్లు కక్ష్యను పెంచినట్లు ఇస్రో వెల్లడించింది. ఇక చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్కు సంబంధించి అన్ని పారామీటర్లను అత్యంత జాగ్రత్తతతో పరిశీలిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇక జూలై 22న చంద్రయాన్-2ను ప్రయోగించినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ పారామీటర్లు నార్మల్గానే ఉన్నట్లు ఇస్రో పేర్కొంది. ఆగష్టు 20న చంద్రుడి సమీపంకు చేరుకోగానే... మరోసారి ద్రవ ఇంజిన్ను మండించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెడతామని ఇస్రో వెల్లడించింది.
నాలుగు సవాళ్లను అధిగమించిన తర్వాత...
ఇక ఈ ఘట్టం ముగిసిన తర్వాత మరో నాలుగు సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని ఆ పై చివరి కక్ష్యలోకి ప్రవేశపెడతామని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. చంద్రడి కక్ష్యలో 13 రోజుల పాటు ప్రయాణించిన తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ వేరుపడుతుంది. కొన్ని రోజుల పాటు పరిభ్రమించిన తర్వాత సెప్టెంబర్ 7న రోవర్ చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో ల్యాండ్ అవుతుంది. ఇది విజయవంతమైతే చంద్రడిపైకి వెళ్లిన దేశాల సరసన నాలుగో దేశంగా భారత్ చరిత్రలో నిలుస్తుంది. అంతుకుముందు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే తమ రోవర్లను చంద్రుడిపైకి ల్యాండ్ చేశాయి.