చంద్రయాన్ 2: విక్రమ్ విఫలం కావడంపై మౌనం వీడని ఇస్రో
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రాజెక్టు కొంత మేర విఫలం కావడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) స్తబ్ధుగా ఉండిపోయింది. చంద్రుడిపైకి హార్డ్ ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ ఇస్రో పంపిన సంకేతాలను అందిపుచ్చుకోకపోవడంతో శాస్త్రవేత్తలు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సెప్టెంబర్ 7న హార్డ్ ల్యాండ్ అయ్యింది. అయితే, ల్యాండర్ ముక్కలవ్వలేదని, బాగానే ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. తిరిగి ఇస్రోతో కమ్యూనికేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే, వారు చేస్తున్న ప్రయత్నాలకు మాత్రం విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సాంకేతాలు రావడం లేదు. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు కొంత ఆందోళనలో మునిగిపోయారు.
ఈ నేపథ్యంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు ఎవరూ కూడా మీడియా ముందుకు రావడం లేదు. అయతే, ఇస్రో అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా తాము చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తున్నారు. ఇస్రోకు చెందిన టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఐఎస్టీఆర్ఏసీ) స్క్రీన్ పై బ్లాంక్గాచూపెట్టిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండ్ అయినప్పటికీ ల్యాండర్ ముక్కలు కాలేదని, బాగానే ఉందని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండర్ లోపలే ఉందన్ని వెల్లడించిన ఇస్రో.. ఇది నిర్దేశిత ల్యాండింగ్ ప్రాంతానికి కొద్ది దూరంలో ఓ పక్కకి ఒరిగిపోయిందని పేర్కొంది. అయితే, విక్రమ్ ల్యాండర్.. ఇస్రో ఇచ్చే సంకేతాలను తీసుకునే స్థితిలో ఉందా? లేదా? అనేది మాత్రం శాస్త్రవేత్తలు వెల్లడించడం లేదు.
కాగా, సెప్టెంబర్ 7న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -2 చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉండగా.. సాంకేతిక లోపం కారణంగా 2.1కి.మీ దూరంలో ఉండగా సిగ్నల్స్ నిలిచిపోయాయి. కొద్ది సేపటి వరకు సిగ్నల్స్ వస్తాయని ప్రయత్నించిన ఇస్రో శాస్త్రవేత్తలు చివరకు విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు రావడం లేదని ప్రకటించారు. తాజాగా, విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభించడంతో కాంటాక్ట్ అయ్యేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని ఇస్రో ప్రకటించింది.