విక్రమ్ల్యాండర్ స్థితిగతులపై ఫోటోలు తీయనున్న నాసా ఆర్బిటార్
చంద్రయాన్-2 మిషన్ కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్ పరిస్థితి ఎలా ఉంది? తలకిందులుగా పడిందా? నిద్రాణస్థితిలోకి ఎలా జారింది? దీనికి గల కారణాలేంటీ? నిరంతరాయంగా వేర్వేరు రూపాల్లో పంపిస్తోన్న రేడియో సంకేతాలను ఎందుకు పసిగట్టలేకపోతోంది? ప్రస్తుత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను కంటి మీద కునకు లేకుండా చేస్తోన్న ప్రశ్నలు ఇవి. ఇందులో ఏ ఒక్క ప్రశ్నకూ ఇస్రో శాస్త్రవేత్తల వద్ద సరైన సమాధానం లేదు. చివరికి అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధక కేంద్రం (నాసా) పంపిస్తోన్న సంకేతాలను కూడా విక్రమ్ ల్యాండర్ గ్రహించట్లేదంటే.. దాని పరిస్థితి ఆందోళనకరంగానే ఉండొచ్చనే అనుమానాలు శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్నాయి.
వారి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికే క్షణం రానుంది. మరో కొద్ది గంటల్లో విక్రమ్ ల్యాండర్ వాస్తవ ఫొటోలు ఇస్రో శాస్త్రవేత్తల చేతికి అందబోతున్నాయి. నాసా ఇదివరకే అంతరిక్షంలోకి ప్రయోగించిన లూనార్ రికాయిన్నెసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) విక్రమ్ ల్యాండర్ ఫొటోలను తీయబోతోంది. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఈ ఎల్ఆర్ఓ..
చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగినట్లుగా భావిస్తోన్న ప్రదేశానికి సంబంధించిన ఫొటోలను చిత్రీకరించబోతోంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా నాసా పూర్తి చేసింది. లూనార్ ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి సంబంధించిన ఫొటోలు తమకు అందగానే.. వాటిని ఇస్రో శాస్త్రవేత్తలకు అందజేస్తామని నాసా ఇదివరకే వెల్లడించింది.