చంద్రయాన్ -2: అసలైన పరీక్ష సెప్టెంబర్ 2న ఉందన్న ఇస్రో ఛైర్మెన్ శివన్
బెంగళూరు: చంద్రయాన్-2 ముఖ్యమైన అంకాన్ని విజయవంతంగా ముగించుకుందని చెప్పారు ఇస్రో ఛైర్మెన్ డాక్టర్ శివన్. అయితే ఇక్కడి నుంచి మూన్ మిషన్ మరికొన్ని సవాళ్లను అధిగమిస్తుందని అన్నారు శివన్. చంద్రయాన్ 2 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిందని చెప్పిన శివన్.. కక్ష్యలో దాని వేగం సెకనుకు 10.9 కిలోమీటర్లుగా ఉందని చెప్పారు. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించడానికి అవసరమైన ద్రవరూపంలో ఉన్న ఇంధనాన్ని 1738 సెకన్ల వరకు మండించడం ద్వారా చంద్రయాన్ -2 ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఇక అసలైన సవాలును సెప్టెంబర్ 2న చంద్రయాన్ -2 అధిగమిస్తుందని డాక్టర్ శివన్ చెప్పారు. ఇక సెప్టెంబర్ 7న భారత కాలమాన ప్రకారం ఉదయం 4 గంటలకు చంద్రయాన్-2 చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని శివన్ చెప్పారు. ఆరోజు ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని వీక్షిస్తారని చెప్పారు. చంద్రయాన్ -2లో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని శివన్ స్పష్టం చేశారు. స్పేస్ క్రాఫ్ట్కు సంబంధించి అన్ని పారామీటర్లు సాధారణంగానే ఉన్నట్లు వెల్లడించారు. సేఫ్ ల్యాండింగ్ కూడా చాలా అద్భుతంగా జరుగుతందనే విశ్వాసంను శివన్ వ్యక్తం చేశారు. చంద్రయాన్ -1లో తలెత్తిన సమస్యలు ఇందులో ఉత్పన్నం కాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు ఇస్రో ఛైర్మెన్ చెప్పారు.
సెప్టెంబర్ 2న చంద్రయాన్-2లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంటుందని చెప్పిన శివన్... ఆ రోజున ల్యాండర్ ఆర్బిటర్ నుంచి వేరుపడుతుందని చెప్పారు. సెప్టెంబర్ 3న ల్యాండర్ వ్యవస్థ పనితీరుపై పరీక్షిస్తామని చెప్పారు. అనంతరం సెప్టెంబర్ 7న ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై అడుగుపెడుతుందని చెప్పారు. ప్రస్తుతం చంద్రుడికి 150 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్ -2 ఉందని డాక్టర్ శివన్ తెలిపారు.
ISRO Chief K Sivan: #Chandrayaan2 mission crossed a major milestone today, the precise lunar orbit insertion maneuver was carried out at 9 am for about 30 minutes and Chandrayaan 2 was precisely inserted in the defined orbit. pic.twitter.com/uR9LhAux4u
— ANI (@ANI) August 20, 2019