జీఎస్ఎల్వీ, జీశాట్ 6ఏ ప్రత్యేకతలు: త్వరలో చంద్రయాన్ 2 సహా భారీ ప్రాజెక్టులు
నెల్లూరు: అంతరిక్ష ప్రయోగాలలో భారత్ మరోసారి సత్తా చాటింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (జీఎస్ఎల్వీ) రాకెట్ను గురువారం సాయంత్రం ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.
నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్-08: జిశాట్ ఎఫ్6తో ఎన్నో ఉపయోగాలు
ఈ వాహన నౌక ద్వారా 2140 కిలోల బరువైన జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ప్రకృతి వైపరీత్యాలు, విపత్కర పరిస్థితులలో దశంలోని సెల్ టవర్లు మొరాయించినా ఈ ఉపగ్రహం వల్ల మొబైల్ ఫోన్లు మూగబోయే ప్రమాదం ఉండదు. రోదసీ నుంచి ఉపగ్రమే సిగ్నల్స్ అందిస్తూ సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది.
జీఎస్ఎల్వీ ప్రత్యేకతలు
జీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 12వది. దీని బరువు 415.6 టన్నులు. పొడవు 49.1 మీటర్లు. మూడు దశలు. జీఎస్ఎల్వీ ఎఫ్ 08లో మొదటి దశ ఇంజిన్లో ద్రవ ఇంధనంతో నడిచే 4 స్ట్రాపాన్ బూస్టర్లు, మిశ్రమ ఘన ఇంధనంతో పనిచేసే ప్రధాన ఇంజిన్ ఉంది. రెండో దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించారు. మూడో దశలో క్రయోజనిక్ ఇంజిన్ ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసి ఆరో క్రయోజనిక్ ఇంజిన్ ఇది. ఆరోసారి రాకెట్ ప్రయోగానికి వినియోగించారు.
పెలోడ్ సామర్థ్యం పెంచుకోవచ్చు
జీఎస్ఎల్వీ ఎఫ్ 08లో మొదటిసారి వికాస్ ఇంజిన్ను ఉపయోగించారు. ఇది రెండో దశలో అధిక పీడనాన్ని ఇస్తోంది. మహేంద్రగిరిలో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఏర్పాటయిన తర్వాత రూపొందించిన వికాస్ ఇంజిన్ను జీఎస్ఎల్వీలో ఉపయోగించారు. దీని వల్ల పెలోడ్ సామర్థ్యం పెంచుకోవచ్చు.
జీశాట్ 6ఏ వల్ల ఈ రెండు ముఖ్య ప్రయోజనాలు
ఇస్రో జీశాట్ 6ని 2015లో కక్షలోకి ప్రవేశపెట్టింది. మళ్లీ ఇప్పుడు జీఎస్ఎల్వీ ఎఫ్ 08ను జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టారు. దీని జీవిత కాలం పదేళ్లు. దీనికి రూ.270 కోట్లు ఖర్చయింది. ఇస్రో నిర్మించిన అతిపెద్ద యాంటెనాలలో జీశాట్ 6ఏది ఒకటి. ఆరు మీటర్ల వ్యాసంతో ఉంది. ఉపగ్రహం నిర్ణీత కక్షలో చేరిన వెంటనే ఇది గొడుగులా తెరుచుకుంటుంది. ఇందులో మల్టీ బీమ్ కవరేజ్ సౌకర్యం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల్లో మొబైల్ కమ్యూనికేషన్స్ను అందిస్తుంది. రక్షణ దళాలకు జీశాట్ 6ఏ ఉపగ్రహ సేవలు ఎంతగానో ఉపయోగపడుతాయి. జీశాట్ 6ఏని హైపవర్ కమ్యూనికేషన్ ఉపగ్రహంగా పిలుస్తారు.
చంద్రయాన్ 2 సహా మరిన్ని భారీ రాకెట్లు
ముందున్న పెను సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని మరిన్ని విజయాలను అందించాల్సిన బాధ్యత తమపై ఉందని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ జీఎస్ఎల్వీ ప్రయోగం అనంతరం అన్నారు. ఇది చక్కని శ్రమ ఫలితం అన్నారు. ఈ ఏడాది ఇప్పటికే పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ ప్రయోగాలను విజయవంతం చేశామని, ఇంకా భారీ రాకెట్ ప్రయోగాలను చేయనున్నామన్నారు. ఏప్రిల్ 12న పీఎస్ఎల్వీ సి41 రాకెట్ ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్ 1ఐ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెడతామని, చంద్రుడిపై మరిన్ని పరిశోధనల కోసం ఈ ఏడాది అక్టోబరులో చంద్రయాన్2 రాకెట్ ప్రయోగం చేయనున్నట్లు తెలిపారు. దీనిని ఏప్రిల్లో ప్రయోగించాల్సి ఉండగా పలువురు నిపుణులు కొన్ని పరీక్షలు చేపట్టాలని సూచించడంతో ప్రయోగం వాయిదా వేసినట్లు తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందించామని, ఇందుకు రూ.800 కోట్ల వరకు వ్యయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.