చంద్రుడికి సమీపంలో: మరో సవాలును అధిగమించిన చంద్రయాన్-2
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చంద్రయాన్-2. జూలై 22న శ్రీహరికోట నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరిన చంద్రయాన్-2 ఆ తర్వాత రెండు సవాళ్లను అధిగమించింది. భూకక్ష్య పెంపులోకి శాస్త్రవేత్తలు చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రవేశపెట్టగా భూకక్ష్యను మరింతగా పెంపొందించి చంద్రయాన్-2ను అందులో కూడా ప్రవేశపెట్టి విజయం సాధించారు. ఇక తాజాగా సోమవారం మధ్యాహ్నం మరింత ఎత్తయిన కక్ష్యలోకి శాస్త్రవేత్తలు చంద్రయాన్-2ను ప్రవేశపెట్టారు. ప్రపల్షన్ వ్యవస్థను మండించడం ద్వారా ఈ చర్య జరిగింది. భూకక్ష్యను క్రమంగా పెంచుకుంటూ పోయిన శాస్త్రవేత్తలు మొత్తంగా మూడో సారి కక్ష్యను పెంచి అందులోకి చంద్రయాన్-2ను ప్రవేశ పెట్టారు.
భూమి ఉపరితలం పై నుంచి 276 కనిష్ట ఎత్తులో ఉండగా... ఉపరితలం నుంచి గరిష్ట ఎత్తు71.792 కిలోమీటర్లుగా ఉంది. ఇక జూలై 26 నుంచి చంద్రయాన్ -2 స్పేస్ క్రాఫ్ట్ 251*54,829 కిలోమీటర్ల కక్ష్యలో ప్రయాణిస్తున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదిలా ఉంటే చంద్రయాన్-2 తన కక్ష్యను మరో రెండు సార్లు పెంచుకుంటుంది. ఇది ఆగష్టు 2న, ఆగష్టు 6న జరుగుతుంది. ఆ సమయంలో 221*143585 కిలోమీటర్ల కక్ష్యలో చంద్రయాన్ ప్రయాణిస్తుంది. అక్కడే ఆగష్టు 14వరకు చక్కర్లు కొట్టి ఆ తర్వాత భూకక్ష్యను దాటుకుని చంద్రుడి వైపు పయనిస్తుంది.
#Chandrayaan2
— ISRO (@isro) July 29, 2019
Today after performing the third orbit raising maneuver, we are now 3 steps closer to the moon !!!#ISRO pic.twitter.com/M8iqxwZgZr
మూడో కక్ష్య పెంచి చంద్రయాన్-2ను అందులోకి ప్రవేశపెట్టాక చంద్రుడి దగ్గరకు చేరేందుకు మరో మూడు ప్రక్రియల దూరంలో చంద్రయాన్ -2 ఉన్నట్లు ఇస్రో ప్రకటించింది.ఇదిలా ఉంటే ఇస్రో చంద్రుడి కక్ష్యలోకి ఆగష్టు 20న ప్రవేశిస్తుంది. అక్కడ కొన్ని రోజులు పాటు తిరిగి సెప్టెంబర్ 7న ల్యాండర్ వేరుపడుతుంది. ఆ తర్వాత రోవర్ బయటకు వచ్చి చంద్రుడి దక్షిణ ధృవంపై ఉన్న నీటి ఆనవాలను పరిశోధన చేస్తుంది.