చంద్రయాన్-2 కథ ముగియలేదు! సాఫ్ట్ల్యాండ్ చేసి చూపుతామంటూ శివన్
న్యూఢిల్లీ: చంద్రయాన్-2 కథ ముగియలేదన్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఛైర్మన్ కె శివన్. త్వరలోనే సాఫ్ట్ ల్యాండింగ్ని చేసి చూపుతామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అనేక అత్యాధునిక శాటిైలట్లను కక్ష్యలోకి ప్రవపెట్టనున్నామని తెలిపారు.
చంద్రయాన్ -2: నాసా ఆర్బిటార్కు చిక్కని విక్రమ్ల్యాండర్ జాడ
సాఫ్ట్ ల్యాండింగ్ కల నిజం చేస్తాం..
ఐఐటీ ఢిల్లీలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
చంద్రయాన్-2 ప్రయోగం నుంచి సాంకేతికతరంగా ఇస్రో ఎంతో అనుభవం సాధించిందని కైలాసవాడివో శివన్ తెలిపారు. సమీప భవిష్యత్తులో సాఫ్ట్ ల్యాండింగ్ కలని నిజం చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
సూర్యుడిపై పరిశోధన కోసం..
‘ఆదిత్య ఎల్1' ఉపగ్రహం, మానవరహిత అంతరిక్ష యాత్రపై ప్రస్తుతం దృష్టి సారించామని శివన్ తెలిపారు. సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. చిన్న ఉపగ్రహ వాహన నౌకల(ఎస్ఎస్ఎల్వీ) ప్రయోగానికి సర్వం సిద్ధమైందని శివన్ తెలిపారు. డిసెంబర్ లేదా జనవరిలో తొలిసారి ఇది అంతరిక్షంలోకి దూసుకెళ్లనుందని వెల్లడించారు.
మొబైల్ సేవల కోసం నావిక్..
త్వరలో నావిక్ సిగ్నల్స్ మొబైల్ ఫోన్లకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. మన దేశం అభివృద్ధి చేస్తున్న సొంత ఉపగ్రహాధారిత నావిగేషన్ వ్యవస్థే నావిక్ అని శివన్ వెల్లడించారు. దీని ఆధారంగా సమాజానికి ఉపయోగపడే అనేక అప్లికేషన్స్ అభివృద్ధి చేయడానికి మార్గం సుగమం అవుతుందన్నారు.
డబ్బు సంపాదన కోసం కాకుండా..
నేటి ప్రపంచం అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని శివన్ తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు తమ వృత్తి జీవితాన్ని అత్యంత జాగ్రత్తగా, తెలివితో నిర్ణయించుకోవాలని సూచించారు. కేవలం డబ్బు సంపాదన కోసం కాకుండా అభిరుచులకు అనుగుణంగా లక్ష్యాల్ని ఎంపిక చేసుకోవాలని చెప్పారు. చేసే పనిలో నిబద్ధతగా ఉండాలని, నైపుణ్యాలు, బలాలు కూడా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఐఐటీ బాంబే నుంచి తాను గ్రాడ్యూయేట్ తీసుకున్నట్లు శివన్ తెలిపారు. ప్రస్తుతం ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు.