వచ్చే ఏడాదే: సాంకేతిక కారణాలతో చంద్రయాన్-2 మిషన్ వాయిదా
భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ముందు అనుకున్న ప్రకారం 2018 అక్టోబర్లో చంద్రయాన్-2ను చంద్రుడిపైకి పంపాల్సి ఉండగా ఈ మిషన్ను వాయిదా వేశారు శాస్త్రవేత్తలు. కొన్ని సాంకేతిక కారణాలతోనే మిషన్ వాయిదా వేసినట్లు ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ అన్నాదురై తెలిపారు. దీంతో భారత్ కంటే ముందు ఇజ్రాయిల్ దేశం స్పేస్ సెల్ అనే ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి తయారైన రాకెట్ను చంద్రుడిపైకి ఈ ఏడాది డిసెంబర్లో పంపనుంది.
ఇందుకోసం ఇజ్రాయిల్ కంపెనీ అమెరికాకు చెందిన ఫాల్కన్-9 రాకెట్ను వినియోగిస్తోంది. డిసెంబర్లో దీని యాత్ర ప్రారంభమై ఫిబ్రవరి 13,2019న చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. అయితే ఇప్పుడు భారత్ ఇజ్రాయిల్ దేశాల మధ్య ఎవరు ముందు చంద్రుడిపైకి రాకెట్ పంపుతారో అన్న పోటీ నెలకొంది. చంద్రుడిపై దక్షిణ ధృవం వద్ద రాకెట్ను ల్యాండ్ చేసి ఆ తర్వాత రోవర్తో పలు ప్రయోగాలు నిర్వహించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే... వచ్చే ఏడాది జనవరిలో చంద్రయాన్ -2 మిషన్ నింగిలోకి దూసుకెళ్లి చంద్రుడిపై ఫిబ్రవరిలో ల్యాండ్ అవుతుందని అన్నాదురై వివరించారు. జీశాట్ జీఎస్ఎల్వీ-ఎమ్కే 3 రాకెట్ ద్వారా ప్రయోగం నిర్వహిస్తామని అన్నాదురై తెలిపారు. ఈ రాకెట్ బరువు దాదాపు 640 టన్నులు ఉంటుందని చెప్పారు. చంద్రుడిపై ఉన్న వాతావరణానికి అనుకూలంగా ఉండేలా రోవర్ను పరీక్షిస్తున్నామని ఆయన వివరించారు. 2008లో భారత్ చంద్రయాన్ -1ను తొలిసారిగా ప్రయోగించిందని అయితే చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ జరిగింది. దీంతో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ముక్కలుగా విరిగిపోయి ఉంటుందని శాస్త్రవేత్తలు నాడు తెలిపారు. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే చంద్రుడిపై తమ రాకెట్లను సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాయి.