చంద్రయాన్-2: ప్రజ్ఞాన్ రోవర్లో కదలికలు, బాగా పనిచేస్తోంది! చెన్నై టెక్కీ పరిశీలన, ఇస్రో శోధన
చెన్నై: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ పూర్తిగా విఫలం కాలేదని ఇప్పటికే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయిన విషయం విధితమే.
రోవర్ బాగా పనిచేస్తోంది..
అయితే, చంద్రుడిపై చక్కర్లు కొడుతూ పరిశోధనలు జరిపేలా రూపొందించిన రోవర్ ప్రజ్ఞాన్ మాత్రం బాగా పనిచేస్తోందని చెన్నైకి చెందిన అంతరిక్ష ఔత్సాహికుడు, టెక్కీ షణ్ముగ సుబ్రమణియన్(షాన్) వెల్లడించారు. గతంలో విక్రమ్ ల్యాండర్ జాడను సుబ్రమణియనే గుర్తించారు. మే నెలలో నాసా విడుదల చేసిన చిత్రాలను విశ్లేషించడం ద్వారా ఈ విషయం తెలిసిందని చెప్పారు.
రోవర్ కదిలిన గుర్తులు..
గత నవంబర్ నెలలో తీసిన చిత్రాలలో చంద్రుడిపై నీడ ఉండటంతో రోవర్ జాడ సరిగా కనిపించలేదని, కేవలం ల్యాండర్, దాని శకలాల్ని మాత్రమే గుర్తించగలిగామని షణ్ముగ సుబ్రమణియన్ తెలిపారు. కానీ, జనవరిలో తీసిన చిత్రాల్లో రోవర్ కదిలిన గుర్తులు కూడా కనిపించాయని చెప్పారు. రోవర్ బాగానే పనిచేస్తోందని, కొన్ని మీటర్ల దూరం ప్రయాణించి ఉంటుందని షాన్ అంచనా వేస్తున్నారు. అంతేగాక, కొన్ని రోజులపాటు ల్యాండర్, రోవర్ మధ్య సంకేతాలు కూడా నడిచి ఉండొచ్చని తెలిపారు.
Recommended Video
షార్ పరిశీలనపై.. ఇస్రో పరిశోధనలు
ఈ మేరకు గుర్తించిన తాజా సమాచారాన్ని ట్విట్టర్ వేదికగా ఫొటోలతో సహా పంచుకున్నారు షాన్. అంతేగాక, ఇస్రోకు కూడా పంపారు. తాను గుర్తించిన విషయాలను ఇస్రో ధృవీకరించాల్సి ఉందని తెలిపారు. కాగా, దీనిపై ఇస్రో ఛైర్మన్ కే శివన్ స్పందించారు. షాన్ పంపిన వివరాలు తమకు అందాయని, దీనిపై పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. శాస్త్రవేత్తలు దీనిపై పనిచేస్తున్నారని, ప్రస్తుతానికి ల్యాండర్, రోవర్ పనితీరుపై ఏం చెప్పలేమన్నారు.
ఒకవేళ ప్రజ్ఞాన్ రోవర్ పనిచేస్తూ ఉంటే..
ఒక వేళ రోవర్ పనిచేస్తుంటే ఇస్రోకు సంకేతాలు పంపి ఉండేదని శివన్ తెలిపారు. కానీ, సంబంధాలు కోల్పోవడంతోనే వాటిని అందుకోలేకపోయి ఉండొచ్చన్నారు. కాగా, జులై 22, 2019లో చంద్రయాన్-2 ప్రయోగం చేయగా..సెప్టెంబర్ 7, 2019లో విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై హార్డ్ ల్యాండ్ కావడంతో ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో మిషన్ సఫలం కాలేదని ఇస్రో ప్రకటించింది. అయితే, ప్రజ్ఞాన్ రోవర్ పనిచేసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో షాన్ పరిశీనలనలకు మరోసారి ప్రాధన్యత లభించింది.