చంద్రయాన్ 2: విక్రమ్ ల్యాండర్ కనుగొన్నది ఇతనే.. ఇందుకోసం ఏం చేశాడంటే..?
Recommended Video
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -2 చివరి నిమిషంలో గాడి తప్పిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ చివరి నిమిషంలో ట్రాక్ తప్పడంతో చంద్రయాన్ -2 విఫలమైంది. ఇక అప్పటి నుంచి విక్రమ్ ల్యాండర్ జాడ కోసం నాసాకు చెందిన లూనార్ రికానైసన్స్ ఆర్బిటార్ వేట సాగించింది. ఈ క్రమంలోనే విక్రమ్ ల్యాండర్ జాడ దొరికిందంటూ సెప్టెంబర్ 17న నాసా ఆర్బిటార్ తీసిన ఫోటోను సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేసింది. అదే సమయంలో విక్రమ్ ల్యాండర్ క్రాష్ జరగకముందు తీసిన ఫోటోలతో పోల్చి చూడాలంటూ ప్రజలకు నాసా ఆహ్వానం పంపింది. ఈ ఆహ్వానమే ఐటీ ప్రొఫెషనల్ షణ్ముగ సుబ్రహ్మణ్యంలో ఆసక్తి కలిగించింది.
పాత కొత్త ఫోటోలను జాగ్రత్తగా పరిశీలించాను: షణ్ముగ
33 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ అయిన షణ్ముగ నాసా ల్యాండర్ జాడను ఎలా కనిపెట్టగలిగాడో వివరించారు. నాసా కనిపెట్టలేని విక్రమ్ ల్యాండర్ను తాను కనిపెట్టాలని భావించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక రెండు ల్యాప్టాప్స్లో విక్రమ్ ల్యాండర్ జాడ అని చెబుతూ ఉన్న పాత ఫోటోను ఒక ల్యాప్టాప్లో నాసా కొత్తగా విడుదల చేసిన మరో ఫోటోను ఇంకో ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసి రెండింటిని పోల్చడం చూసినట్లు షణ్ముగ చెప్పారు. కనిపెట్టడం కొంత కష్టమైనప్పటికీ దీన్ని కనిపెట్టేందుకు కాస్త సమయం తీసుకున్నట్లు చెప్పాడు. ఇలా అక్టోబర్ 3వ తేదీన తాను విక్రమ్ ల్యాండర్ జాడను కనిపెట్టినట్లు ట్విటర్ పై పోస్టు చేసినట్లు షణ్ముగ చెప్పారు.
షణ్ముగ నివేదికతో మరోసారి ల్యాండర్ కోసం ప్రయత్నించిన నాసా
ఆ తర్వాత నాసా మరోసారి విక్రమ్ ల్యాండర్ కోసం వేట మొదలు పెట్టింది. ఈ సారి షణ్ముగ చెప్పిన ప్రదేశంలోనే వెతకడం మొదలు పెట్టింది. రెండు నెలల తర్వాత విక్రమ్ ల్యాండర్ జాడను నాసా ధృవీకరించిందని షణ్ముగ చెప్పారు. ప్రజల్లోకి ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను బయటకు చెప్పే ముందు పక్కాగా నిర్ధారించుకోవాల్సి ఉంటుందని అందుకే నాసా రెండు నెలల సమయం తీసుకుందని షణ్ముగ చెప్పారు. అయితే తన వరకు చెప్పాలంటే చంద్రయాన్ -2 మిషన్ ఓ రకంగా సక్సెస్ అయ్యిందని అయితే విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అవడం ఒక్కటే విచారించదగ్గ విషయమని చెప్పారు. అయితే చంద్రయాన్-2 మిషన్తో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గురించి ప్రపంచం చర్చించుకోవడం శుభపరిణామం అని అన్నారు.
చంద్రుడిపై శిథిలాలను కనిపెట్టడం కష్టం
ఇక తాను విక్రమ్ ల్యాండర్ జాడ కనుగొన్నట్లు తెలపగానే తన నివేదిక ఆధారంగా నాసా ల్యాండర్ కోసం వెతికి నిజమే అని ధృవీకరించడాన్ని తనకు ఎంతో ఆనందం కలిగించిందని షణ్ముగ చెప్పారు. అదే సమయంలో చంద్రుడిపై ఉన్న శిథిలాలను కనిపెట్టడం చాలా కష్టమని చెప్పారు. అయితే శిథిలాల్లో ఒకటి మాత్రమే కనిపెట్టగలిగానని షణ్ముగ చెప్పారు. జూలైలో టేకాఫ్ తీసుకున్న చంద్రయాన్ -2 మిషన్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగేందుకు మరో 2.1 కిలోమీటర్లు దూరంలో ఉండగా ల్యాండర్ గతి తప్పింది. గ్రౌండ్ స్టేషన్తో కూడా సంబంధాలు తెగిపోయాయి.