చంద్రయాన్ -2 టైమ్లైన్: 2008లో అనుమతుల నుంచి 2019 సేఫ్ ల్యాండిగ్ వరకు...!
బెంగళూరు: మరికొన్నిగంటల్లో అంతరిక్షంలో అద్భుత ఘట్టంకు తెరలేవబోతోంది. చంద్రుడిపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన ప్రతిష్టాత్మక మూన్ మిషన్ చంద్రయాన్-2 సెప్టెంబర్ 7 శనివారం తెల్లవారుజామున 1:30 గంటల నుంచి 2:30 గంటల మధ్య చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంపై ల్యాండ్ కానుంది.విక్రమ్ ల్యాండర్ను సేఫ్ ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం 1 గంట నుంచి 2 గంటల మధ్య విక్రమ్ ల్యాండర్కు ఛార్జింగ్ ఇవ్వనుంది. ప్రస్తుతం చంద్రయాన్ జాబిల్లికి సమీపంలోకి వస్తోంది. ఇక శనివారం తెల్లవారు జామున చంద్రుడిపైకి క్రమంగా దిగుతుంది. ఇక ముందుగా అనుకున్నట్లుగా అంతా సవ్యంగా జరిగితే ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ వేరుపడి చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో ప్రగ్యాన్ రోవర్ సంచరిస్తుంది.
చంద్రయాన్-2 జాబిల్లికి సమీపంలోకి దూసుకెళుతోంది
చంద్రయాన్ - 2 మిషన్ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ గత పదేళ్లుగా శ్రమిస్తోంది. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఇటు భారత్కు అటు మానవాళికి ఎంతో మేలు చేస్తుంది. 2008లో ఈ ప్రాజెక్టుకు విత్తనం వేశారు. ముందుగా అనుమతులతో ప్రారంభమైన చంద్రయాన్-2 ప్రాజెక్టు ప్రయాణం 2019 వరకు నిరంతరంగా సాగింది. ఇప్పటి వరకు అంతరిక్షరంగంలో భారత్ ఒక లెవెల్లో ఉండగా... చంద్రయాన్-2 విజయవంతమైతే మరో మైలురాయిని చేరుకుంటుంది. చంద్రయాన్కు సంబంధించి అంటే చంద్రుడిపైకి చంద్రయాన్-2ను పంపాలన్న ఆలోచన నుంచి శనివారం పూర్తికానున్న చివరి ఘట్టం వరకు మొత్తం టైమ్లైన్ ఒకసారి చూద్దాం.
చంద్రయాన్-2 టైమ్లైన్:
అనుమతికి గ్రీన్ సిగ్నల్: చంద్రుడి దక్షిణ ధృవం ప్రాంతంపైకి చంద్రయాన్-2ను పంపాలని ఇస్రో ప్రతిపాదనకు 2008 సెప్టెంబర్ 18న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మిషన్ ప్లానింగ్: అనుమతి ఇచ్చిన తర్వాత మొత్తం మిషన్పై శాస్త్రవేత్తలు స్టడీ చేయడం ప్రారంభించారు
నింగిలోకి చంద్రయాన్-2: జూలై 22న మధ్యాహ్నం 2గంటల 43 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి నిప్పులు చిమ్ముతూ జీఎస్ఎల్వీ ఎంకే 3 దూసుకెళ్లింది.
చంద్రుడిపైకి చంద్రయాన్: ఇక అన్ని సవాళ్లను అధిగమిస్తూ సెప్టెంబర్ 7 తెల్లవారుజామున 1:30 గంటల నుంచి 2:30 గంటల మధ్య చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్ సురక్షితంగా ల్యాండ్ కానుంది.
చంద్రుడిపై ప్రయోగం: ల్యాండర్ నుంచి వేరుపడి రోవర్ ప్రగ్యాన్ చంద్రుడిపై సంచరిస్తుంది. అక్కడి నీటి ఆనవాలను, ఇతర ఖనిజాలపై పరిశోధన చేసి భూమికి పంపుతుంది.
కక్ష్యకు సంబంధించిన ప్రయోగాలు: కక్ష్యకు సంబంధించిన ప్రయోగాలను ఒక ఏడాదిపాటు నిర్వహిస్తారు ఇస్రో శాస్త్రవేత్తలు