చంద్రుడిపైకి మరోసారి ప్రయత్నం: కొత్త ప్రాజెక్టును సూచనప్రాయంగా వెల్లడించిన ఇస్రో ఛైర్మన్
చెన్నై: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త ప్రాజెక్టుకు సన్నాహాలు చేస్తోందా? ఈ ప్రాజెక్టు కూడా చంద్రుడిని చేరుకోవడానికేనా? జాబిల్లి మీదికి మరోసారి ల్యాండర్ ను పంపించబోతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. చంద్ర మండలాన్ని అందుకోవడానికి ఇస్రో మరోసారి ప్రయత్నాలు సాగించడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ కే శివన్ సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ మేరకు తమిళనాడు విద్యార్థులకు ఆయన ఓ లేఖను రాశారు. ప్రాజెక్టు గురించి ప్రాథమిక విషయాలను అందులో పొందుపరిచారు.
ఆశల్లేని విక్రమ్ ల్యాండర్..
చంద్రయాన్-2 మిషన్ లో భాగంగా జాబిల్లి మీదికి పంపించిన విక్రమ్ ల్యాండర్ ఆచూకి తెలియరాకుండా పోయిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ చందమామ దక్షిణ ధృవం వైపు ఉపరితలంపై దిగినప్పటికీ.. దానితో అనుసంధానం కాలేకపోతోంది ఇస్రో. విక్రమ్ ల్యాండర్ జాడను కనుగొనడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా రంగంలో దిగినా ఆశించిన ఫలితం రాలేదు. నాసా ప్రయోగించిన అత్యాధునిక ఆర్బిటర్ల కెమెరా కంటికి కూడా చిక్కలేదు విక్రమ్ ల్యాండర్. ఈ నేపథ్యంలో- దీనిపై ఆశలను పూర్తిగా వదిలేసుకుంది ఇస్రో.
తమిళనాడు విద్యార్థులు లేఖ..
మరోసారి చంద్రయాన్ ప్రాజెక్టును చేపట్టాలని ఇస్రో ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. చంద్రుడి మీదికి చేరడానికి సరికొత్త ప్రయోగాన్ని చేపట్టబోతున్నట్లు కే శివన్ సూచనప్రాయంగా తెలియజేశారు. తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా ఆరంతంగి మండలం అవనాథన్ కోట్టై గ్రామం ప్రాథమిక పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు కొద్దిరోజుల కిందట శివన్ కు లేఖ రాశారు. విక్రమ్ ల్యాండర్ గురించి విద్యార్థులు ఆరా తీశారు. విక్రమ్ ల్యాండర్ ఆచూకి దొరక్కపోతే.. అలాంటి ప్రయత్నమేదైనా మళ్లీ చేస్తారా? అంటూ విద్యార్థులు వేసిన ప్రశ్నలకు శివన్ అవునని సమాధానం ఇచ్చారు.
కొత్త ప్రాజెక్టు..చంద్రుడిపైకే
విద్యార్థుల ప్రశ్నలకు బదులిస్తూ శివన్ ఈ నెల 4వ తేదీన లేఖ రాశారు. ఆ లేఖ శనివారం అవనాథన్ కోట్టై పాఠశాలకు అందింది. పాఠశాల ప్రధానొపాధ్యాయురాలు పీ కళైసెల్వి ఈ లేఖను ఆదివారం మీడియాకు విడుదల చేశారు. తమిళంలో రాసి ఉందా లేఖ. చంద్రుడి మీదికి పంపించడానికి మరో ప్రాజెక్టును సిద్ధం చేసే ఆలోచన ఉందని, త్వరలోనే అది కార్యరూపం దాల్చుతుందని శివన్ పేర్కొన్నారు. చంద్రయాన్-2 ప్రాజెక్టు నిరాశ పరిచిందని, అయినప్పటికీ.. అందులో చోటు చేసుకున్న లోపాలను సరి చేసుకుని కొత్త మిషన్ ను చేపడతామని రాశారు.
విద్యార్థుల్లో అవగాహన హర్షణీయం..
చంద్రయాన్-2 ప్రాజెక్టు పట్ల విద్యార్థుల్లో అవగాహన ఏర్పడటం పట్ల శివన్ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల పట్ల రాబోయే తరానికి చెందిన విద్యార్థులు ఆసక్తి చూపడం స్వాగతించదగ్గ విషయమని అన్నారు. ఇలాంటి విషయాలు శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా రంగాల్లో నూతనత్వాన్ని తీసుకొస్తాయని చెప్పారు. భవిష్యత్తులో మరింతమంది శాస్త్రవేత్తలు పుట్టుకుని రావాలని శివన్ అకాంక్షించారు. శివన్ ను ఆదర్శంగా తీసుకుని తాను చదువుకుంటున్నానని కే షాలిని అనే విద్యార్థిని చెప్పారు. చంద్రయాన్-2 ప్రాజెక్టు విఫలం కావడం, విక్రమ్ ల్యాండర్ ఆచూకి గల్లంతు కావడం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు.