Chandrayaan 2: 21వ తేదీ వరకే, విక్రమ్కు గుడ్ బై చెప్పే సమయం వచ్చింది..!
చంద్రయాన్ 2 మిషన్ ద్వారా చేపట్టిన విక్రమ్ ల్యాండర్ అంశంలో ఉత్కంఠ కొనసాగుతోంది. చివరి క్షణాల్లో విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండ్ కావడంతో సిగ్నల్స్ కోల్పోయింది. విక్రమ్ దిగినట్లుగా భావిస్తున్న ప్రదేశాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ (NASA)కు చెందిన లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ (LRO) ఉపగ్రహం తన కెమెరాతో ఫోటో తీసింది. పొడవైన నీడలు ఆ ప్రాంతాన్ని ఆవరించాయని LRO డిప్యూటీ ప్రాజెక్టు సైంటిస్ట్ తెలిపారు. బిలాల అంచుల నీడలు సమీపంలోని మైదాన ప్రాంతాలకు విస్తరించాయని తెలిపారు.
చంద్రయాన్-2 గురించి మరింత చదవండి
నెల తర్వాత అదే ప్రదేశానికి మళ్లీ LRO
లక్షిత ల్యాండింగ్ ప్రదేశాన్ని అదే దక్షిణ ధృవం మీదుగా ప్రయాణించిన LRO కెమెరా చిత్రీకరించిందని, కానీ విక్రమ్ ల్యాండర్కు సంబంధించిన నిర్దిష్ట ప్రదేశం మాత్రం తెలియరాలేదని, అది LRO కెమెరా దృష్టిలో పడి ఉండకపోవచ్చునని చెబుతున్నారు. కొత్త చిత్రాలను, పాత చిత్రాలను పోల్చి చేసి విక్రమ్ ఆచూకీ కోసం తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నీడ ప్రాంతంలో కానీ, కెమెరా చిత్రీకరించని చోట కానీ విక్రమ్ ల్యాండర్ ఉండి ఉండవచ్చునన్నారు. అక్టోబర్ 14న LRO తిరిగి ఇధే ప్రదేశానికి వస్తుందన్నారు.
చీకట్లోకి విక్రమ్ ల్యాండర్
విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశంలో సూర్య రశ్మి తక్కువ ఉంటుందని, దీంతో ఫోటోలు మసక మసకగా కనిపిస్తున్నాయని నాసా పేర్కొందని చెబుతున్నారు. చంద్రుడిపై 14 రోజులు ఒక పగలు, మిగతా 14 రోజులు రాత్రి ఉంటుంది. చంద్రయాన్ 2 ఆర్బిటార్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చందమామపై దిగి 11 రోజులు దాటింది. దీంతో ఆ ప్రాంతంలో క్రమంగా చీకటి ఆవరిస్తోంది. వెలుతురు సరిగా లేకపోవడంతో విక్రమ్ ల్యాండర్ కనిపించడం లేదని నాసా చెబుతోంది.
శాశ్వతంగా ఆశలు వదులుకోవాలి...
విక్రమ్తో సంబంధాలు ఏర్పర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 21వ తేదీ తర్వాత ఆ ప్రాంతంలో రాత్రి సమయం ప్రారంభమవుతుంది. 14 రోజుల పాటు చీకటి ఉంటుంది. దీని వల్ల చెలరేగే మైనస్ 200 డిగ్రీల ఉష్ణోగ్రతతో విక్రమ్లోని పరికరాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. చంద్రుడిపై ఏర్పడే అతి శీతల ఉష్ణోగ్రత వల్ల చీకటి ప్రాంతాన్ని మంచు కప్పేస్తుంది. సూర్య రశ్మి ఉండదు. 14 రోజుల తర్వాత కానీ సూర్యరశ్మి రాదు. అప్పటికి ల్యాండర్లోని సోలార్, సిగ్నలింగ్ వ్యవస్థలు పనిచేసే స్థితిలో ఉండాలి. కానీ కష్టమే. కాబట్టి ఈ రెండు రోజుల్లో సంబంధాలు ఏర్పరుచుకోకుంటే దీనిపై ఆశలు శాశ్వతంగా వదులుకోవాలి.
చల్లని వాతావరణంలో స్తంభించే అవకాశాలు ఎక్కువ
మైనస్ 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో విక్రమ్ ల్యాండల్ సెప్టెంబర్ 7వ తేదీ వరకు పని చేస్తూ ఉండాలి. అయితే అక్కడి చల్లని వాతావరణం ల్యాండర్ సాధనాలను స్తంభింప చేసే అవకాశాలే ఎక్కువ. విక్రమ్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందని కూడా ఇస్రో గుర్తించాల్సి ఉంది.
చైనీస్ రోవర్ల వలె హీటింగ్ ఉపకరణాలు లేవు
చైనీస్ రోవర్ల వలె విక్రమ్ ల్యాండర్లో చల్లని వాతావరణం నుంచి బయట పడేందుకు హీటింగ్ ఉపకరణాలు లేవు. పద్నాలుగు రోజులు రాత్రి ఉండటం వల్ల భూమితో కమ్యూనికేట్ చేసే స్థితిలో విక్రమ్ ల్యాండర్ ఉండదు. అయితే సౌత్ పోలార్ రీజియన్కు పగలు తిరిగి వచ్చిన తర్వాత విక్రమ్ ల్యాండింగ్ సైట్ మరిన్ని ఫోటోలు తీసే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 14వ తేదీ నాటికి నాసా ఆర్బిటార్ మరోసారి అదే ప్రాంతానికి రానుంది.