Chandrayaan-2 : రోజులు ముగిశాయి...విక్రమ్ ల్యాండర్పై ఆశలు ఆవిరైనట్లే..!
ఇస్రో చంద్రుడిపైకి ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో ట్రాక్ తప్పింది. చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్ ఇస్రోకు ఎలాంటి సంకేతాలు పంపలేదు. ఇక విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయినట్లు గుర్తించారు. విక్రమ్ ల్యాండర్ ఉత్తర ధృవంలో ఉన్నట్లు ఆర్బిటార్ గుర్తించింది. ఇక ఆ తర్వాత మరో 14 రోజుల సమయం ఉండటంతో శాస్త్రవేత్తలు ల్యాండర్తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రయత్నించారు. అయితే ల్యాండర్తో సంబంధాల పునరుద్ధరణకు చివరి తేదీ సెప్టెంబర్ 21 కావడం విశేషం. ఇక ఆ తేదీ కూడా వచ్చేయడంతో చంద్రయాన్-2 పై ఆశలు ఆవిరయ్యాయి. చంద్రుడిపై ఒక్కరోజు భూమిపై 14 రోజులకు సమానం.
సౌరశక్తితో పనిచేసేలా ల్యాండర్ డిజైన్
చంద్రుడిపై ల్యాండ్ అవగానే విక్రమ్ ల్యాండర్ సౌరశక్తితో పనిచేసేలా రూపొందించారు శాస్త్రవేత్తలు. కానీ ఆ సౌరశక్తి కేవలం 14 రోజులు మాత్రమే ఉంటుంది. సూర్యకిరణాలు చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో పడే అవకాశం లేనందున ల్యాండర్కు ఛార్జ్ అయ్యే అవకాశం లేదు. అంతకుముందు ల్యాండర్ జాడ తెలుసుకునేందుకు నాసా కూడా తమ ఆర్బిటార్ను ప్రయోగించింది. అయినప్పటికీ విక్రమ్ ల్యాండర్ జాడ తెలియరాలేదు.
సెప్టెంబర్ 7న ల్యాండర్తో తెగిపోయిన సంబంధాలు
సెప్టెంబర్ 7న ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై ల్యాండ్ అయ్యేందుకు 2.1 కిలోమీటర్ల దూరం ఉండగా అక్కడే గాడి తప్పింది. సమాచారం వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో శాస్త్రవేత్తలు కాస్త నిరాశకు గురయ్యారు. ఇక అప్పటి నుంచి ల్యాండర్తో సమాచార వ్యవస్థను పునరుద్దరించేందుకు శాస్త్రవేత్తలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఇస్రో ప్రకటించింది. ఇక చంద్రుడిపై ఒక్క రోజు ముగియనుండటంతో ఆశలు ఆవిరవుతూ వచ్చాయి. ల్యాండర్ హార్డ్ ల్యాండిండ్ అయి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
గగన్యాన్ మిషన్పైనే దృష్టి
ల్యాండర్ సాఫ్ట్ ల్యాండిగ్ అయ్యేలా శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. ఇక ల్యాండర్ ల్యాండ్ అయ్యాక ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చి 14 రోజుల పాటు జాబిల్లిపై తిరిగి అక్కడి నీటి ఆనవాలు, ఖనిజాలపై పరిశోధనలు చేసి ఇస్రోకు పంపాల్సి ఉంది. ఇక సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఇస్రో చీఫ్ డాక్టర్ శివన్ ఓ ప్రకటన చేశారు. చంద్రయాన్ -2 లోని ఆర్బిటార్ బాగా పనిచేస్తోందని అందులోని పేలోడ్లన్నీ సాధారణంగా ఉన్నాయని చెప్పారు. మరోవైపు విక్రమ్ ల్యాండర్తో సమాచారా పునరుద్ధరణ జరగలేదని చెప్పారు. ఇక తమ దృష్టంతా గగన్యాన్ మిషన్ పైనే ఉందని స్పష్టం చేశారు.మొత్తానికి ఇస్రో ఛైర్మెన్ డాక్టర్ శివన్ ఇచ్చిన ప్రకటనతో విక్రమ్ ల్యాండర్ మీద ఇప్పటి వరకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయనే చెప్పాలి.