చంద్రయాన్ -3: వచ్చే నవంబర్లో చంద్రయాన్ -3,సాఫ్ట్ ల్యాండింగే లక్ష్యం
బెంగళూరు: రెండు నెలల క్రితం చంద్రుడిపైకి ఇస్రో పంపిన చంద్రయాన్-2 మిషన్ ప్రయోగం విఫలమవడంతో మళ్లీ చంద్రుడిపైకి మరో మిషన్ను ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది. అది వచ్చే ఏడాది నవంబర్లోగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆ దిశగా ఇస్రో ప్రయత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది. ఇక చంద్రయాన్-3 పేరుతో జరగనున్న ఈ ప్రయోగం కోసం భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఓ హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ కమిటీకి తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ సోమనాథ్ నేతృత్వం వహిస్తారు. చంద్రయాన్-3కి సంబంధించి అన్ని ప్రతిపాదనలతో కూడిన నివేదికను ఈ కమిటీ సమర్పిస్తుంది.
చంద్రయాన్-2కు ముందు ఇస్రో పై సైబర్ దాడి జరిగిందా..? రిపోర్ట్ చెబుతోందేమిటి..?
వచ్చే ఏడాది నవంబర్లో ప్రయోగం..?
సోమనాథ్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చే నివేదిక కోసం ఇస్రో ఎదురుచూస్తోందని ఒక్కసారి కమిటీ నివేదిక అందగానే పనులను వేగవంతం చేస్తామని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే కమిటీకి కొన్ని సూచనలు చేసినట్లు చెప్పిన అధికారి ఆ సూచనలకు అనుగుణంగా నివేదిక తయారు చేస్తుందని అధికారి తెలిపారు. వచ్చే ఏడాది నవంబర్లో చంద్రయాన్ -3ని ప్రయోగిస్తామని వెల్లడించారు. ఈ సారి అంటే చంద్రయాన్-3లో రోవర్, ల్యాండర్పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తామని అధికారి వెల్లడించారు.ల్యాండింగ్ సమయంలో మళ్లీ తప్పులు పునరావృతం కాకుండా సాఫ్ట్ ల్యాండింగ్కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నిటినీ తీసుకుంటామని చెప్పారు. చంద్రయాన్-2లో జరిగిన అతి చిన్న తప్పులను సైతం కరెక్ట్ చేసుకుని పక్కాగా అమలు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
గతి తప్పిన విక్రమ్ ల్యాండర్
ఈ ఏడాది సెప్టెంబర్ 7న చంద్రయాన్ -2 చంద్రుడి దక్షిణధృవం దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాల్సి ఉండగా విక్రమ్ ల్యాండర్ గతితప్పింది. దీంతో క్రాష్ ల్యాండింగ్ జరగడంతో భూమితో సంబంధాలు కోల్పోయింది. విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ దొరకలేదు. అయితే రంగంలోకి దిగిన నాసా ఆర్బిటార్ ల్యాండర్ను కనుగొనింది. అదే సమయంలో కొన్ని రోజుల తర్వాత చంద్రయాన్ ఆర్బిటార్ కూడా విక్రమ్ ల్యాండర్కు సంబంధించిన ఫోటోలను పంపింది.
నివేదికకు ఇంకా ఆమోదం తెలపని ప్రధాని కార్యాలయం
ఇక ల్యాండర్ పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు జాతీయస్థాయిలో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీలో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు మరికొందరు నిపుణులు ఉన్నారు. ఈ కమిటీకి ఇస్రోలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టం సెంటర్ అధిపతి నారాయణన్ నేతృత్వం వహించారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతోనే ల్యాండర్ ఆచూకీ తెలుసుకోలేకపోయినట్లు విశ్లేషించారు. ప్రయోగం సందర్భంగా ఎక్కడ తప్పులు దొర్లాయనేదానిపై పెద్ద ఎత్తున నివేదిక ఇస్రోకు సమర్పించింది కమిటీ. అయితే ప్రధాని కార్యాలయం ఈ నివేదికకు ఆమోద ముద్ర వేసిన తర్వాత రిపోర్టును బహిరంగం చేస్తారని సమాచారం.