నిప్పులు చిమ్ముతూ నింగిలోకి: చంద్రయాన్ -2 ప్రయోగం సక్సెస్....అంతరిక్షరంగంలో భారత్ చరిత్ర
అంతరిక్ష రంగంలో భారత్ మరో కలికితు రాయిని చేరుకుంది. చంద్రయాన్-2 మిషన్ను నింగిలోకి విజయవంతంగా పంపింది. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 43 నిమిషాలకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది జీఎస్ఎల్వీ మార్క్ -3 వాహక నౌక. ఆ చంద్రయాన్ - 2 ప్రయోగానికి ఆదివారం నుంచే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దాదాపు 20 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగింది. శనివారం రోజునే షార్ సెంటర్లో రాకెట్ సన్నద్ధత సమావేశం నిర్వహించారు. రాకెట్ ప్రయోగ రిహార్సల్స్ ద్వారా పలు అంశాలను పరిశీలించి అంతా ఓకే అనుకున్నాక ప్రయోగానికి పచ్చజెండా ఊపారు.
మేరా భారత్ మహాన్ : చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్..అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన భారత్
మిషన్ టైమ్ లైన్..!
జీఎస్ఎల్వీ - మార్క్ 3 ఎం1 వాహన నౌక చంద్రయాన్ - 2 ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు మూడు దశలుగా విభజించారు. తొలుత క్రయో ఇంజిన్లో ద్రవ ఇంధనం నింపారు. రెండో దశలో భాగంగా ఎల్ - 110 ఇంజిన్లో ద్రవ ఇంధనం నింపారు. అలా తొలిదశలో వాడే రెండు ఎస్ - 200 బూస్టర్లను ఘన ఇంధనంతో నింపారు. అనంతరం వాటిని రాకెట్కు అనుసంధానించారు. ఆ ప్రక్రియ అంతా ముగిశాక.. రాకెట్లోని ఎలక్ట్రానిక్ వ్యవస్థల పనితీరును మరోసారి తనిఖీ చేశారు. మొత్తానికి కౌంట్ డౌన్ జీరోకు చేరుకోగానే ఎస్ - 200 బూస్టర్లు రాజుకోవడంతో నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది రాకెట్. జీఎస్ఎల్వీ ఎంకే-3 టేకాఫ్ తీసుకున్న 16 నిమిషాలకు నిర్దిష్ట భూకక్ష్యలోకి చంద్రయాన్-2ను ప్రవేశపెట్టింది.
చంద్రుడి దగ్గరకు చేరుకునే ప్రక్రియ
నింగిలోకి చేరుకున్న తర్వాత రాకెట్ నుంచి కాంపోజిట్ మాడ్యూల్ విడిపోయింది. అనంతరం కొన్ని రోజుల పాటు రోదసీలో పయనించి చంద్రుడి సమీపంలోకి చేరనుంది. దాని తర్వాత లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలో చంద్రయాన్-2 పే లోడ్ సంచరిస్తుంది. అలా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రక్రియ తర్వాత దీర్ఘావృత్తాకారంలో ఉండే లూనార్ బౌండ్ ఫేస్ కక్ష్యలో చంద్రయాన్-2 పరిభ్రమించనుంది. ఆ తంతు ముగిశాక అడాప్టర్ నుంచి ఆర్బిటర్ వేరుపడేలా చేస్తారు. అందులోని అపోజీ మోటారును మండించడం ద్వారా.. చంద్రుడికి వంద కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అలా 48వ రోజు చంద్రుడి దక్షిణ ధృవంపైకి ఆర్బిటర్ నుంచి ల్యాండర్ను దించుతారు. అనంతరం అందులోని రోవర్ బయటకు వచ్చి 500 మీటర్ల పరిధిలో పయనిస్తూ చంద్రుడిపై పరిశోధనలు చేస్తుంది.
కీలకంగా వ్యవహరించనున్న ల్యాండర్ రోవర్లు
చంద్రయాన్ - 2 ప్రయోగంలో భాగంగా జీఎస్ఎల్వీ - మార్క్ 3 ఎం1 రాకెట్ మోసుకెళ్లే కాంపోజిట్ మాడ్యూల్లో మూడు పరికరాలు అత్యంత కీలకమైనవి. అవి ల్యాండర్, ఆర్బిటర్, రోవర్. ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. ఇక ల్యాండర్ చంద్రుడిపై దిగనుంది. ఇక ల్యాండర్లో ఉండే రోవర్ చంద్రుడి ఉపరితలంపై నీటి ఆనవాళ్లపై పరిశోధన చేస్తుంది. చంద్రయాన్-2 ఉపగ్రహంలో రోవర్, ల్యాండర్, ఆర్బిటర్ ను అనుసంధానం చేశారు. దాని బరువు 3 వేల 447 కిలోలు. ఇందులో ఒక ప్రొపెల్లర్ బరువే 1179 కిలోలు. ప్రయోగం జరిగిన అయిదు రోజుల తరువాత భూ నియంత్రిత కక్ష్యలోకి చంద్రయాన్-2 ఉపగ్రహం ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి 3 లక్షల 50 వేల కిలోమీటర్ల దూరం చంద్రుని వైపు పయనిస్తుంది. ఆ విధంగా చంద్రునిపై ల్యాండర్ కాలుమోపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ఛైర్మెన్ శివన్
ఇక చంద్రయాన్-2 మిషన్ విజయవంతం అయ్యిందని ఇస్రో ఛైర్మెన్ కె.శివన్ అన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ మరో చరిత్రను సృష్టించిందన్నారు. ఈ విజయం కోసం శ్రమించిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. అంతేకాదు తొలిసారి ప్రయోగం సందర్భంగా సాంకేతిక లోపం తలెత్తిందని అయితే దీన్ని 24 గంటల్లో గుర్తించి శాస్త్రవేత్తలు మరమత్తులు చేశారని అన్నారు.
ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రధాని మోడీ అభినందనలు
ఇదిలా ఉంటే చంద్రయాన్-2 సక్సెస్ కావడంతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మొత్తం ప్రయోగాన్ని ప్రధాని మోడీ ఆయన కార్యాలయం నుంచి టీవీలో వీక్షించారు.ఇలాంటి ప్రయోగాల ద్వారా యువత అంతరిక్ష రంగం వైపు మొగ్గు చూపుతుందని చెప్పిన ప్రధాని మోడీ...చంద్రుడి దక్షిణ ధృవం దగ్గర ఇప్పటి వరకు ఎలాంటి మిషన్ ప్రయోగాలు చేపట్టలేదన్నారు. తొలిసారిగా చంద్రయాన్-2 ఈ సాహసం చేయనుందని ప్రధాని మోడీ ట్విటర్లో పోస్టు చేశారు. ఇక ప్రపంచదేశాలు కూడా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించాయి.
మొత్తానికి చంద్రయాన్-2 విజయవంతం అవడంతో చంద్రుడిపైకి రోవర్ను పంపిన నాలుగో దేశంగా భారత్ చరిత్రకెక్కింది. అంతకుముందు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు తమ రోవర్లను పంపాయి. అయితే చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలోకి ఏ దేశం రోవర్లను పంపలేదు. అలా పంపిన తొలిదేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.