సోలార్ స్కాం: చాందీ ఆవేదన, సరితా కొత్త ఆరోపణ
తిరువనంతపురం: కేరళలో ఏ ముఖ్యమంత్రిపై కూడా ఇప్పటి వరకు చేయని విమర్శలను సోలార్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమెన్ చాందీపై గత ఐదేళ్ల కాలంలో ప్రతిపక్షం ఎల్డీఎఫ్ చేసింది. నిజం చెప్పాలంటే ఇంగ్లీషులో 'హిట్టింగ్ బిలో ద బెల్ట్' అనే రీతిలో తనపై తీవ్ర విమర్శలు చేసిందని ఉమెన్ చాందీ ఓ ఆర్టికల్లో పేర్కొన్నారు.
మనందరికి కుటుంబం ఒక ఆస్తిలాంటిదని పేర్కొన్న ఆయన, తనని బలహీనపరచేందుకు కుటుంబాన్ని కూడా ఈ సోలార్ కుంభకోణంలోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏ కేరళ ముఖ్యమంత్రినైనా ఈ విధంగా వేటాడారా? అంటూ ప్రతిపక్షాలను నిలదీశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షంపై చాందీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించేందుకు ప్రతిపక్షం ఏ విషయంలో కూడా తన మద్దతుని తెలపలేదన్నారు. 2013 నుంచి కూడా సోలార్ కుంభకోణం వార్తల్లో నిలిచిందని అన్నారు. అయితే ప్రతిపక్షం తన భార్య మర్డర్ కేసులో తనకు సంబంధం ఉందని ఆరోపణలు చేయడంతో పాటు 33 చీటింగ్ కేసుల్లో తనకు సంబంధం ఉందని ఆరోపించడం బాధిస్తుందని అన్నారు.
2013లో టీమ్ సోలార్ అనే కంపెనీ తక్కువ ధరలకు సోలార్ ప్యానల్స్ ఇస్తామని కేరళలో ప్రచారం నిర్వహించిందన్నారు. ఈ కంపనీ యజమానులైన సరితా నాయర్ ప్రస్తుతం బెయిల్పై ఉండగా, ఆమె భర్త బిజు రాధాకృష్ణన్ ఇంకా జైలులో ఉన్నారు. అయితే సోమవారం తాజాగా సరితా నాయర్ మరో ఆరోపణ చేశారు.
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్యే బెన్నీ బెహనాన్ పార్టీ ఫండ్ నిమిత్తం తనను 5 లక్షలు ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. కాగా సోలార్ కుంభకోణం విషయానికి వస్తే....
2013లో టీమ్ సోలార్ అనే కంపెనీ తక్కువ ధరలకు సోలార్ ప్యానల్స్ ఇస్తామని కేరళలో ప్రచారం నిర్వహించింది. ఈ కంపనీ యజమానులే సరితా నాయర్, బిజు రాధాకృష్ణన్. అయితే వీరిద్దరూ దంపతులు కావడం విశేషం. సీఎం కార్యాలయ సిబ్బంది ఇతర మంత్రుల కార్యదర్శుల అండదండలతో భారీ ఎత్తున ప్రజల నుంచి నిధులు సేకరించారు.
ఆ తర్వాత సోలార్ ప్యానల్స్ అమర్చారు. ఈ సోలార్ ప్యానల్స్ అమరికపై ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సరితా నాయర్, బిజు రాధాకృష్ణన్లతో పాటు సీఎం వద్ద కార్యదర్శిగా పనిచేసిన టెన్నీజొప్పన్, సినీ నటి షాలు మేనన్లను పోలీసులు అరెస్టుచేశారు.
ఆ తర్వాత ఈ సోలార్ కుంభకోణంపై న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో 2013 నుంచి జైలులో ఉన్న ప్రధాన నిందితురాలు సరితా నాయర్ జస్టిస్ శివరాజన్ కమిషన్ ముందు బుధవారం విచారణకు హాజరై తాను సీఎం చాందీ సన్నిహితుడికి రూ. 1.90 కోట్లు, విద్యుత్ శాఖ మంత్రికి రూ. 40 లక్షలు లంచం ఇచ్చినట్లు వాంగ్మూలమిచ్చారు.
2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 140 స్థానాల్లో యూడీఎఫ్కు 72 ఎల్డీఎఫ్కు 68 స్థానాలు లభించాయి. యూడీఎఫ్లో ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉమెన్ చాందీ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతక ముందు 2004 నుంచి 2006 వరకు ఆయన సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
పీకల్లోతు అవినీతి ఊబిలో చిక్కుకున్న ఉమెన్ చాందీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యూడీఎఫ్ కూటమిలోని కీలక భాగస్వామిగా ఉన్న ఆర్ఎస్పీ ఎమ్మెల్యే కొవూర్ కుంజుమొన్, మరో మంత్రి బాబు తమ పదవులకు ఇటీవలే రాజీనామాలు చేశారు. వీరిపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో పదవుల నుంచి తప్పుకున్నారు.