ఒక్క పదంతో కోట్లు కాజేశారు: జగన్, నిమ్మగడ్డలపై ఈడి
న్యూఢిల్లీ: వాన్పిక్ కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్లకు చెందిన ఆస్తుల జప్తును ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) పూర్తిగా సమర్థించుకుంది. వాన్పిక్ పోర్ట్ అనే పదానికి బదులు వాన్పిక్ ప్రాజెక్ట్స్ అనే పదాన్ని ఉపయోగించి కొన్ని వేల కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నించారని తెలిపింది.
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, ఐఏఎస్ అధికారులు శామ్యూల్, మన్మోహన్ సింగ్, బ్రహ్మానందరెడ్డి తదితరులు నిమ్మగడ్డ ప్రసాద్తో కుమ్మక్కయ్యారని ఆరోపించింది. రూ.864 కోట్ల విలువైన ఆస్తుల జప్తు కేసులో ఈడీ న్యాయ ప్రాధికార సంస్థ సభ్యుడు ముఖేశ్ కుమార్ ముందు బుధవారం విచారణ జరిగింది.
తమ ఆస్తుల్ని జప్తు చేయటం సరి కాదంటూ వైయస్ జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ తరఫు న్యాయవాదులు ముఖేష్ కుమార్ ఎదుట వాదన విన్పించారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి భూములు బదిలీ అయితే మధ్యలో తమను ఎందుకు ఇరికించారంటూ జగన్, నిమ్మగడ్డ తరఫు న్యాయవాదులు చేసిన వాదనకు ఈడీ దర్యాప్తు అధికారి కమల్సింగ్ సమాధానాలు ఇచ్చారు.
2008లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రస్ అల్ ఖైమాకు చెందిన వాన్పిక్ పోర్ట్ సంస్థకు భూములను బదిలీ చేయాల్సి ఉందని, కానీ నిమ్మగడ్డ ప్రసాద్ స్థాపించిన వాన్పిక్ ప్రాజెక్ట్స్ అనే సంస్థకు బదిలీ చేశారని కమల్ సింగ్ వివరించారు. మంత్రివర్గం ఆమోదం లేకుండానే వైయస్ రాజశేఖర రెడ్డి కొన్ని ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారని, మరి కొన్ని అంశాలను మంత్రివర్గం మెమొరాండం లలో పేర్కొనకుండా మంత్రి వర్గాన్ని తప్పుదోవ పట్టించారని చెప్పారు.
భారతీ వ్యవహారంపైనా దృష్టి సారించాం
భారతీ సిమెంట్స్ షేర్లను నిమ్మగడ్డ ప్రసాద్ ఎక్కువ రేటుకు అమ్ముకుని లాభాలు గడిస్తే ఈడీకి వచ్చిన సమస్య ఏమిటని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు సంధించిన ప్రశ్నకు కమల్ సింగ్ సమాధానం ఇస్తూ వాస్తవానికి మూడు దశలు గా నిమ్మగడ్డ ప్రసాద్ భారతీ షేర్లను విక్రయించారని, అందులో రెండుసార్లు లాభాలు రాగా మూడోసారి మాత్రం పెద్ద మొత్తంలో నష్టం వచ్చిందని తెలిపారు.
దానికితోడు ఈ షేర్లను జగన్ చెప్పినట్లుగా ఒక ఫ్రెంచ్ కంపెనీకి విక్రయించారని, ఇదం తా జగన్ కనుసన్నల్లోనే జరిగిందని చెప్పారు. పైగా, సంబంధిత ఫ్రెంచ్ కంపెనీయే తర్వాత కాలంలో భారతి సిమెంట్స్లో అత్యధిక వాటాదారు అయ్యిందని వివరించారు. జగన్, నిమ్మగడ్డ తరఫు న్యాయవాదుల వాదనలపై ఈనెల 26వ తేదీలోగా లిఖితపూర్వకంగా సమాధానాలు దాఖలు చేయాలని ఈడీని న్యాయ ప్రాధికార సంస్థ ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 31వ తేదీకి వాయిదా వేసింది.