కన్నయ్య లాంటి దేశద్రోహి ఇంతవరకు పుట్టలేదు: టెక్స్ట్ పుస్తకాల్లో..
జైపూర్: జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యు) విద్యార్థి కన్నయ్య కుమార్ పైన రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నయ్య కుమార్లో మరొకరు పుట్టకూడదని తమ పాఠ్య పుస్థకాల్లో మార్పులు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి వాసుదేవే దేవ్ నాని అన్నారు.
విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించేందుకు తాము పాఠ్య పుస్తకాలను దేశభక్తితో నిండిన అంశాలను చేరుస్తున్నామన్నారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధుల చరిత్రను, వారి ఫోటోలను పుస్తకాల్లో పెడుతున్నామన్నారు.
జెఎన్యు ఘటనను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో జెండాను ఎగురవేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తాము రాష్ట్ర పుస్తకాల్లో దేశభక్తి అంశాలను చేరుస్తున్నట్లు తెలిపారు.
కాగా, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిందెవరు. దేశద్రోహులెవరు తెలుసుకునేలా నేటితరం విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు జేఎన్యూ విద్యార్థి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ గురించి ప్రతీ విద్యార్థీ తెలుసుకునేలా సవరింపులు చేయనున్నట్లు రాజస్థాన్ విద్యాశాఖ నిర్ణయించింది.
కన్నయ్య లాంటి దేశద్రోహి ఇప్పటివరకు పుట్టలేదనే నేపథ్యంలో పాఠ్యాంశంలో కన్నయ్య గురించి వివరించనున్నట్లు రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి వాసుదేవ్ దేవ్నాని తెలిపారు. ఇప్పటికే ఎనిమిదో తరగతి విద్యార్థులకు జాన్ కీట్స్, థామస్ హార్డీ, విలియమ్ బ్లేక్, టీ.ఎస్ ఈలియట్, ఎడ్వర్డ్ లియర్ రచించిన పుస్తకాలను వాటికి సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించి తెలియని ప్రజ్ఞాశాలుల గురించి విద్యార్థులు తెలుసుకునేలా చర్యలు చేపట్టామన్నారు.