యోగి ఆదిత్యనాథ్ నామ స్మరణ చేస్తారా లేక..: హోర్డింగ్ల కలకలం
ఉత్తర ప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన దూసుకెళ్తున్నారు. అయితే, తాజాగా ఆయన స్థాపించిన హిందూ యువ వాహిని ఏర్పాటు చేసిన కొన్ని హోర్డింగులు కలకలం రేపుతున్నాయి.
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. అయితే, తాజాగా ఆయన స్థాపించిన హిందూ యువ వాహిని ఏర్పాటు చేసిన కొన్ని హోర్డింగులు కలకలం రేపుతున్నాయి.
యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం
మీరట్ ప్రాంతంలో ఈ హోర్డింగ్లు వెలిశాయి. హోర్డింగ్లపై ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫొటోలతో పాటు 'యోగి నామం జపించండి. లేదా ఉత్తర్ప్రదేశ్ వదిలి వెళ్లిపోండి' అని రాసి ఉంది.
హిందు యువ వాహిని బృందం
యోగికి చెందిన హిందు యువ వాహిని బృందం ఈ హోర్డింగ్లను పెట్టించినట్లు పోలీసులు భావిస్తున్నారు. జిల్లా కమిషనర్తో పాటు ఇతర పోలీసుల నివాసాల సమీపంలో ఈ హోర్డింగ్లు ఏర్పాటు చేయడం గమనార్హం.
అతనిని తొలగిస్తామని..
దీనిపై యువవాహిని రాష్ట్ర సభ్యుడు నాగేంద్ర ప్రతాప్ సింగ్ను పోలీసులు సంప్రదించారు. ఈ హోర్డింగ్లను గతంలో యువవాహిని సభ్యుడిగా ఉన్న నీరజ్ శర్మ పంచాలీ వేయించి ఉంటాడని, అతడిని బృందం నుంచి తొలగించడంతో సంస్థకు చెడ్డపేరు తేవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని పోలీసులకు వివరించారు.
ఇలా రాసి ఉంది..
'ప్రదేశ్ మే రెహనా హైతో యోగి యోగి కెహనా హై' (ఎవరైతే రాష్ట్రంలో ఉండాలని అనుకుంటారో వారు యోగి యోగి అనాల్సిందే) అని ఈ హోర్డింగ్లపై ఉంది.
నివేదిక కోరిన పోలీసులు
వీటిపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీ జే రవీంద్ర గౌర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్ల నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.