తిండి దొంగలు: తేజ్ప్రతాప్-ఐశ్వర్య పెళ్లిలో రౌడీ అతిథుల హల్చల్, పెళ్లికి నితీష్
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగాయి. పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం ఆర్జేడీ శాసన సభ్యుడు చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్తో శనివారం జరిగింది. దాణా కుంభకోణం కేసులో జైల్లో ఉన్న లాలూ.. కొడుకు పెళ్లి కోసం బుధవారం పెరోల్ పైన బయటకు వచ్చారు.
తేజ్ ప్రతాప్ పెళ్లి వేడుకలను తల్లి రబ్రీదేవి అన్నింటిన దగ్గరుండి చూసుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అతిథులు వచ్చారు. లాలు నివాసానికి, పెళ్లి కూతురు ఐశ్వర్య రాయ్ బంగ్లాకు కేవలం 200 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఆ మార్గం అంతా పూలు, గ్రీన్ చిల్లీస్, లెమన్లతో అందంగా ముస్తాబు చేశారు. అన్న పెళ్లిలో తేజస్వి స్టెప్పులతో అదరగొట్టారు. పెళ్లి వేడుకకు ముందు అక్కడ తేజ్ ప్రతాప్, ఐశ్వర్యలను శివపార్వతిలుగా చిత్రీకరించారు.
పెళ్లికి నితీష్ కుమార్ హాజరు
తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్య రాయ్ల వివాహం పాట్నాలోని స్ప్రావ్లింగ్ కళాశాల మైదానంలో శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి బీహార్ సీఎం నితీశ్ కుమార్, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దంపతులు, ఇతర బీజేపీ, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
దాదాపు అరగంట పాటు పెళ్లి వద్దే నితీష్
ముఖ్యమంత్రి నితీష్ అక్కడే దాదాపు అరగంట పాటు గడిపారు. వధూవరులతో కలిసి ఫోటోలు దిగారు. లాలూ - నితీష్లు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలకు కూడా ఆహ్వానం అందింది. కానీ వారు హాజరు కాలేదు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పెళ్లి వేడుక పూర్తయ్యాక సాయంత్రానికి వచ్చారు.
చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చారు
ప్రముఖ పారిశ్రామికవేత్త, మీడియా దిగ్గజం సుభాష్ చందర్ ఓ చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చారు. అఖిలేష్ యాదవ్, సతీమణి డింపుల్, ముగ్గురు పిల్లలు మరో చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చారు. బరాత్ పూర్తయ్యాక వారు తిరిగి వెళ్లిపోయారు. ఎస్పీ నేత ప్రఫుల్ పటేల్, నటుడు శత్రుఘ్ను సిన్హా, లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తదితరులు హాజరయ్యారు.
తేజ్ ప్రతాప్ పెళ్లిలో తిండి దొంగల హల్చల్
మరోవైపు, తేజ్ ప్రతాప్ - ఐశ్వర్య రాయ్ల పెళ్లిలో గెస్టులుగా వచ్చిన కొందరు దొంగలు చేతివాటం చూపించారు. వివాహ విందులో ముఖ్య అతిథుల కోసం తయారు చేసిన రుచికరమైన ఆహార పదార్థాలను దొంగిలించారు. అనంతరం వంటశాలకు వెళ్లి అక్కడ ఖరీదైన వంట సామగ్రిని దోచుకెళ్లారు. వీరిని గమనించిన ఆర్జేడీ నాయకులు వారిని పట్టుకోవాలని ప్రయత్నించారు. కానీ అంతకు ముందు వారిని అడ్డుకున్న మీడియా ప్రతినిధుల పైనా దొంగలు దాడి చేశారు. వారి కవరేజ్ పరికరాలను ధ్వంసం చేశారు.
200 స్టాళ్ల ద్వారా ఏడువేల మందికి భోజనాలు
ఈ పెళ్లికి ఏడెనిమిది వేల మంది వరకు వచ్చారు. వారందరికీ మంచి భోజన ఏర్పాట్లు చేశారు. వేడుక ప్రాంగణం రద్దీగా మారడంతో నిఘా కొరవడింది. 200 స్టాళ్ల ద్వారా ఏడువేల మందికి భోజన సముదాయం ఏర్పాటు చేశారు. దీంతో కొందరు దొంగలు అందిన కాడికి దోచుకెళ్లారు. ఈ ఘటనపై నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, భోజనాల వద్ద తొక్కిసలాట జరిగింది. చెత్తా చెదారంతో నిండిపోయింది.