Punjab New Chief Minister : పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీ...
పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీ(47) పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. చరణ్జిత్ సింగ్ చన్నీని పంజాబ్ సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.దీంతో పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్కు తెరదించినట్లయింది.
తాజా మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేబినెట్లో చరణ్జిత్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నారు.ఆయన దళిత సామాజికవర్గానికి చెందిన నేత. ప్రస్తుతం చామకౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2007లో ఇక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... ఇప్పటివరకూ మూడుసార్లు ఇదే నియోజవకవర్గం నుంచి గెలుపొందారు. 2015-2016లో పంజాబ్ అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
చరణ్ జిత్ సింగ్ గతంలో ఖరార్ నుంచి మూడుసార్లు మున్సిపల్ కౌన్సిలర్గా,రెండుసార్లు మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పనిచేశారు.చరణ్జిత్ది పేద కుటుంబ నేపథ్యం.ప్రభుత్వ స్కూల్లోనే విద్యనభ్యసించారు.ఆర్థిక సమస్యల రీత్యా ఆయన తండ్రి మలేషియాలో కొన్నాళ్లు పనిచేశారు. ఆ తర్వాత ఖరార్ పట్టణానికి వచ్చి టెంట్ హౌస్ వ్యాపారం మొదలుపెట్టారు. అందులో టెంట్ బాయ్గా చరణ్జిత్ సింగ్ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు.
పంజాబ్లో దళితుల జనాభా దాదాపు 33శాతంగా ఉన్న నేపథ్యంలో... ఆ వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిని చేయడం 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.
అంతకుముందు,సుఖ్జిందర్ సింగ్ రందవాను సీఎంగా ఖరారు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరినట్లు ప్రచారం జరిగింది.కానీ చివరి నిమిషంలో అనూహ్యంగా చరణ్జిత్ సింగ్ను సీఎంగా ఎంపిక చేయడం గమనార్హం. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే చర్చ జరుగుతున్న క్రమంలో పలువురి పేర్లు తెరపైకి రాగా.. అందులో చరణ్జిత్ పేరు ఎక్కడా వినిపించలేదు. సునీల్ కుమార్ జఖర్,ప్రతాప్ బజ్వా,సుఖ్జీందర్ రంద్వా,సుఖ్బీర్ సింగ్ సకారియా,త్రిప్త్ రజీందర్ సింగ్ బజ్వా,బ్రహ్మ్ మొహీంద్ర,విజయందర్ సింగ్లా,పంజాబ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కులజీత్ సింగ్,ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా పేర్లు జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.
నిజానికి మొదట పార్టీ సీనియర్ నేత,రాజ్యసభ సభ్యురాలు అంబికా సోనికి కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అబింకా సోని ఆ ఆఫర్ను తిరస్కరించారు.అంతేకాదు, పంజాబ్ ముఖ్యమంత్రిగా సిక్కు వర్గానికి చెందిన నేతనే ఉండాలని అభిప్రాయపడ్డారు.ముఖ్యమంత్రి పదవికి సంబంధించి తన అంతరంగాన్ని తాను ఫాలో కావాల్సిందేనని పేర్కొన్నారు.
అనూహ్య పరిణామాల నడుమ అమరీందర్ రాజీనామా :
అనూహ్య పరిణామాల నడుమ కెప్టెన్ అమరీంద్ సింగ్ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయక తప్పలేదు.రోజురోజుకు పార్టీలో తన వ్యతిరేక వర్గం అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతుండటంతో అమరీందర్ రాజీనామా చేశారు.పీసీసీ చీఫ్గా నవజోత్ సింగ్ సిద్దూని నియమించినప్పటి నుంచి కాంగ్రెస్లో అమరీందర్ వర్సెస్ సిద్దూ పోరు ముదురుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్ఠానం వీరిద్దరిని ఢిల్లీకి పిలిపించి సయోధ్య కుదిర్చిందనే ప్రచారం జరిగినప్పటికీ... ఆ ప్రయత్నం బెడిసికొట్టిందనేది తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి.కాంగ్రెస్లో తన వ్యతిరేక వర్గాన్ని సిద్దూనే ఎగదోస్తున్నారని... అధిష్ఠానానికి తనపై పదేపదే ఫిర్యాదులు వెళ్లడం వెనుక సిద్దూనే ఉన్నారని అమరీందర్ భావిస్తూ వచ్చారు.
ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా అనంతరం... సిద్దూపై అమరీందర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది సోనియా నిర్ణయిస్తారని... అయితే నవజోత్ సింగ్ సిద్దూని అందుకు ఎంపిక చేయాలనుకుంటే మాత్రం తాను వ్యతిరేకిస్తానని పేర్కొన్నారుసిద్దూకు పాకిస్తాన్ ప్రధాని,ఆర్మీ చీఫ్లతో ఉన్న సంబంధాల రీత్యా.. ఆయన్ను సీఎంగా చేయడం దేశభద్రతకు ముప్పు అని వ్యాఖ్యానించారు. సిద్దూను సీఎంగా చేయాలనుకునే ఏ చర్యనైనా తాను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు.
Recommended Video
It gives me immense pleasure to announce that Sh. #CharanjitSinghChanni has been unanimously elected as the Leader of the Congress Legislature Party of Punjab.@INCIndia @RahulGandhi @INCPunjab pic.twitter.com/iboTOvavPd
— Harish Rawat (@harishrawatcmuk) September 19, 2021