మహాత్ముడిపై ఎఫ్ఐఆర్, ఛార్జీషీట్ ఇవ్వండి
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్), అభియోగ పత్రాన్ని వెల్లడి చేయాలని కేంద్ర సమాచార కమిషన్ హోంశాఖను ఆదేశించింది. 1948 జనవరి 30న మహాత్ముడు హత్యకు గురయ్యారు.
దీనికి సంబంధించిన ఛార్జిషీట్లను వెల్లడించాలని హోంమంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఒడిశాలోని మోలంగీర్ జిల్లాకు చెందిన హేమంత పండా అనే అతను సమాచార హక్కు చట్టం కింద చేసుకున్న దరఖాస్తుపై సివిసి ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఎఫ్ఐఆర్, చార్జిషీట్తో పాటుగా చట్టప్రకారం పోస్టుమార్టం నిర్వహించారా లేదా లాంటి ఇతర సమాచారాన్ని అందించాలని కోరుతూ ఆయన హోంమంత్రిత్వ శాఖకు ఒక దరఖాస్తు చేసుకున్నారు. పాండా దరఖాస్తును హోం శాఖ భారత పురావస్తు భాండాగారం (నేషనల్ ఆర్కివ్స్ ఆఫ్ ఇండియా) గాంధీ తన చివరి రోజులు గడిపిన, హత్యకు గురయిన గతంలో బిర్లా హౌస్గా చిరపరిచితమైన గాంధీస్మృతి డైరెక్టర్కు, దర్శన్ సమితికి పంపించింది.
1993నాటి పబ్లిక్ రికార్డ్స్ చట్టానికి అనుగుణంగా మీరు కోరిన సమాచారాన్ని చూడడానికి తమ కార్యాలయాన్ని సందర్శించవచ్చని నేషనల్ ఆర్కివ్స్ ఆఫ్ ఇండియా పాండాకు తెలిపింది. కాగా, కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఎలాంటి పోస్టుమార్టం నిర్వహించలేదని గాంధీస్మృతి, దర్శన్ సమితి ఆయనకు చెప్పాయి.
అంతేకాదు గాంధీజీ హత్యకు సంబంధించి ఎఫ్ఐఆర్, దరిమిలా చార్జిషీటు దాఖలుకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కూడా ఆ రెండు సంస్థలు పాండాకు తెలియజేసాయి. హత్య తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్ దర్యాప్తు కొనసాగించినట్లు తన సమాధానంలో గాంధీ స్మృతి చెప్పింది.
అయితే తాను హోంశాఖనుంచి సమాచారాన్ని కోరానని, శాఖ ఆ సమాచారాన్ని తనకు ఇవ్వాలని దరఖాస్తుదారు పట్టుబట్టాడని, అందువల్ల ఎఫ్ఐఆర్, చార్జిషీట్కు సంబంధించి మంత్రిత్వ శాఖ వద్ద గానీ, తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్లో కానీ ఏదైనా సమాచారం ఉందేమో మరోసారి వెతకాలని హోం మంత్రిత్వ శాఖకు చెందిన సిపిఐఓను ఆదేశిస్తున్నట్లు సమాచార కమిషనర్ శరత్ సబర్వాల్ పేర్కొన్నారు.
ఒకవేళ అలాంటి సమాచారం ఏదీ హోం శాఖలో కానీ, తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్లో కానీ లభ్యం కాకపోతే ఆ విషయాన్ని హోం శాఖ సిపిఐఓ పాండాకు లిఖితపూర్వకంగా ఆ విషయాన్ని తెలియజేయాలని సబర్వాల్ పేర్కొన్నారు. ఉత్తర్వులు అందిన 30 రోజుల్లోగా ఈ ఉత్తర్వులను హోం శాఖ సిపిఐఓ అమలు చేయాలని ఆదేశించింది.