షీనాబోరా హత్య కేసులో మరో మలుపు; విడాకులు కావాలన్న ఇంద్రాణీ
కేసులో నిందితులైన షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జీలపై అధికారులు హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేశారు.
ముంబై: ఏప్రిల్,2012లో ముంబయి శివారు ప్రాంతంలో ఇంద్రాణి తన మాజీ భర్తతో కలిసి కారులో షీనా బోరాను గొంతు నులిమి చంపేశారన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ హత్య కేసు మరో కీలక మలుపు తీసుకుంది. కేసులో నిందితులైన షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జీలపై అధికారులు హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేశారు. ఫిబ్రవరి 1న దీనిపై విచారణ జరగనుంది.
గత కొన్నాళ్లుగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. షీనా బోరా సోదరుడు మైకేల్ బోరాపై హత్యాయత్నం చేశారని ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాపై ప్రత్యేక సీబీఐ కోర్టులో అభియోగాలు దాఖలు చేశారు.
షీనా కనిపించకపోవడంపై పదే పదే మైకేల్ ప్రశ్నిస్తుండటంతో అతన్ని కూడా హతమార్చాలని ఇంద్రాణి భావించినట్టుగా సీబీఐ వెల్లడించింది. కాగా, ఇంద్రాణి కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ ఈ కేసులో నాలుగో నిందితుడు. షీనాను హత్య చేయడానికి సహకరించడాని అతనిపై ఆరోపణలున్నాయి. అయితే అతడు అప్రూవర్ గా మారాడు.
కాగా, 2015లో ముంబయి సమీపంలోని అటవీ ప్రాంతంలో సగం కాలిపోయిన స్థితిలో ఉన్న షీనా మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.
పీటర్ నుంచి విడాకులు కోరిన ఇంద్రాణి:
తన భర్త పీటర్ ముఖర్జీ నుంచి విడాకులకు అనుమతివ్వాల్సిందిగా ఇంద్రాణి ముఖర్జీ ముంబై కోర్టును కోరింది. అయితే కోర్టు మాత్రం ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇందులో కోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి తెలిపారు.
పీటర్ ముఖర్జీతో ఇంద్రాణికి 2002లో వివాహం జరిగింది. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. షీనా హత్య కేసులో ఇంద్రాణి 2015లో అరెస్టయ్యారు.