మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితులపై అభియోగాలు నమోదు
2008లో మలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక జాతీయ విచారణ సంస్థ ఎన్ఐఏ కోర్టు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురుహిత్, సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్తో పాటు మరో ఐదు మందిపై అభియోగాలు మోపింది. కేసును విచారణ చేసిన జస్టిస్ వినోద్ పదాల్కర్ నిందితులపై వచ్చిన అభియోగాలను సమర్థించారు.
మరోవైపు తమపై అభియోగాలు మోపకుండా స్టే ఇవ్వాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు నిందితులు.ఇందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో కేసును విచారణ చేస్తున్న ట్రయల్ కోర్టు వారిపై అభియోగాలు నమోదు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించింది. గతంలో విచారణ జరపరాదని దీనిపై స్టే ఇవ్వాలంటూ పురోహిత్ హైకోర్టు సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ను తోసిపుచ్చిన కోర్టులు విచారణ వేగవంతం చేయాలని విచారణ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.
చట్టవిరుద్ధ చర్యలు నివారణ చట్టం కింద నిందితులపై ఉగ్రవాదం నేరాన్ని విచారణ సంస్థ నమోదు చేసింది. క్రిమినల్ కుట్ర, హత్య కేసులను కూడా వీరిపై నమోదు చేసింది. ఒక్కసారి అభియోగాలు రికార్డు చేయబడ్డాక ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభమవుతుంది. పురోహిత్, సాధ్విలతో పాటు కేసులో మేజర్ (రిటైర్డ్) రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రాహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిలపై కేసు నమోదు చేశారు. జడ్జి వీరిపై మోపిన అభియోగాలు చదువుతున్న సమయంలో వీరంతా కోర్టులోనే ఉన్నారు.
ఇక ఈ కేసు పూర్వాపరాలు చూస్తే... మహారాష్ట్రలోని మలేగావ్లో ఓ మసీదు దగ్గర పార్క్ చేసి ఉన్న మోటార్సైకిల్లో బాంబు పెట్టారు. ఇది పేలడంతో ఆరుమంది మృతి చెందగా 100 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇది సెప్టెంబర్ 29, 2008లో జరిగింది.