హీరోయిన్పై లైంగిక దాడి కేసు: ప్రముఖ హీరోకు షాకిచ్చిన కోర్టు.. అభియోగాల నమోదు
టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ను కిడ్నాప్ చేసి.. కదులుతున్న కారులోనే ఆమెపై లైంగికదాడికి పాల్పడటమే కాకుండా.. ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్ మెయిల్ కు యత్నించిన కేసులో ప్రముఖ మలయాళ నడుడు దిలీప్ కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. దిలీప్ తోపాటు మరో ఎనిమిది మందిపై అభియోగాల నమోదు చేయాలంటూ కొచ్చి అదనపు స్పెషల్ సెషన్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
తప్పించుకోవాలని హీరో ట్రై చేసినా..
హీరోయిన్ ను కిడ్నాప్ చేసి, లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుల జాబితా నుంచి తన పేరు కొట్టేయాలంటూ దిలీప్ దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ ను శనివారమే కొట్టేసిన కోర్టు.. సోమవారం నాటి విచారణలో అభియోగాల నమోదుకు ఆదేశించింది. దిలీప్ నేరం చేశాడనడానికి కావాల్సిన ఆధారాలన్నీ బలంగా ఉన్నాయని, ఎట్టిపరిస్థితుల్లోనూ పేరు కొట్టేయడం కుదరదని స్పెషల్ జడ్జి హనీ వర్గీస్ తెలిపారు. దిలీప్ పిటిషన్ ను కొట్టేయాలన్న ప్రాసిక్యూషన్ వాదనతో జడ్జి ఏకీభవించారు.
అప్పీలుకు కూడా నిరాకరణ
ట్రయల్ కోర్టు నిర్ణయంతో షాక్ తిన్న హీరో దిలీప్.. హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసుకుంటానని, అందుకు 10 రోజుల గడువు కావాలని చేసిన విన్నపాన్ని కూడా జడ్జి తిరస్కరించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గత నవంబర్ లో ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలోనే అప్పీలుకు అవకాశం ఇవ్వడంలేదని జడ్జి వివరించారు. దీలీప్, పల్సర్ సునీల్ తోపాటు నిందితులందరూ తాము నేరం చేసినట్లు ఇప్పటిదాకా అంగీకరించలేదు. దీంతో అభియోగాలు నమోదుచేసి విచారణ కొనసాగిస్తున్నట్లు స్పెషల్ కోర్టు ప్రకటించాల్సివచ్చింది.
అసలేం జరిగిందంటే..
సినిమా అవకాశాలకు సంబంధించి బాధిత హీరోయిన్ కు, హీరో దిలీప్ కు మధ్య గొడవలొచ్చాయి. ఆమెపై కక్ష పెంచుకున్న దిలీప్.. పల్సర్ సునీల్ అనే కిరాయి గుండా సాయంతో 2017, ఫిబ్రవరి 17న నటిని కిడ్నాప్ చేయించాడు. కదులుతున్న కారులోనే దుండగులు ఆమెపై లైంగికదాడికి పాల్పడి, ఆ దృశ్యాలను వీడియోతీసి దిలీప్ కు పంపారు. ఆ వీడియోలను అడ్డంపెట్టుకుని హీరోయిన్ ను దారికి తెచ్చుకోవాలనుకున్నాడు. అయితే హీరోయిన్ ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హీరోగారి విలన్ చేష్టలు బట్టబయలయ్యాయి. ఈ కేసులో దిలీప్ను 2017 జూలైలో కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలానికి అతను బెయిల్ పై విడుదలయ్యాడు. ఎవిడెన్స్ లను ప్రభావితం చేస్తున్న దిలీప్ ను జైల్లోనే ఉంచాలంటూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దీంతో కేసు విచారణను ఆరు నెలల్లోగా ముగించాలంటూ ట్రయల్ కోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం నవంబర్ లో ఆదేశాలిచ్చింది.