జియాఖాన్ సూసైడ్పై ఛార్జీషీట్: సూరజ్ ప్రేరేపించడంవల్లే!
ముంబై: బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో న్యాయస్థానంలో ఛార్జీషీట్ దాఖలు చేసిన ముంబై పోలీసులు.. ఆమెను ప్రియుడు సూరజ్ పంచోలీయే ఆత్మహత్యకు ప్రేరేపించాడని పేర్కొన్నారు. 447 పేజీల ఛార్జీషీటును పోలీసులు ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశారు.
మొత్తం 22 మంది సాక్ష్యాలను అందులో పేర్కొన్నారు. జియాఖాన్కు గర్ఫస్రావం చేసిన వైద్యులు, ఆమె నివసించే భవనం వాచ్మెన్, సూరజ్ నివాసంలోని పనిమనుషులు, స్నేహితుల సాక్ష్యాలను అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ఫోరోన్సిక్ నివేదికలను ఉంచారు.
కాగా, గత ఏడాది జూన్ 3వ తేదీన జియాఖాన్ ఉరేసికొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జియా లేఖ అంటూ ఆమె తల్లి ఆరు పేజీల లేఖను పోలీసులకు అందించారు. అందులో సూరజ్ పంచోలితో తనకు గల సంబంధం, ఆయన తనను ఎలా వంచించారో పేర్కొన్నారు. ఆ తర్వాత సూరజ్ అరెస్టై ముంబై హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు.
సూరజ్, జియాఖాన్ల మధ్య సంబంధం ఉందనేందుకు చాలా సాక్ష్యాలు ఉన్నాయని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఆత్మహత్య చేసుకునే రోజు కలవాలని జియా కోరినప్పటికీ సూరజ్ కలవలేదన్నారు. మరోవైపు జియాఖాన్ను ఎవరైనా చంపవచ్చునని ఆమె తల్లి అనుమానిస్తున్నారు. కానీ, పోలీసులకు అందుకు ఆధారాలు లభించలేదు.
పోలీసులు ఛార్జీషీట్ దాఖలుచేసినప్పుడు సూరజ్ పంచోలి, ఆయన తండ్రి న్యాయస్థానంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా సూరజ్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తాను ఛార్జీషీటును చూడలేదని, ఇప్పుడే ఏమీ మాట్లాడనని చెప్పారు. సూరజ్కు ఛార్జీషీటుకు సంబంధించిన ఓ కాపీని ఇచ్చారు. కేసు ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా పడింది.