ముంబైలో కుప్పకూలిన విమానం: ఐదుగురు మృతి
Recommended Video
ముంబై: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఓ చార్టర్డ్ విమానం ముంబైలోని ఓ రద్దీ ప్రాంతంలో కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం ఘట్కోపూర్లో సర్వోదయ్ నగర్లో ఈ ప్రమాదం చేసుకుంది. జుహు ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతూ నిర్మాణంలో ఉన్న ఓ భవంతిపై కుప్పకూలినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు..
విమానంలో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారనీ.. ఈ ప్రమాదం కారణంగా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఓ పైలట్, ముగ్గురు ప్రయాణికులు, ఓ పాదచారి ఉన్నారు.
విమానం కూలిపోయిన వెంటనే ఘటనా ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు.
మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక బృందాలు ప్రయత్నించాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం ఘటనా ప్రాంతానికి తరలివెళ్లాయి. కాగా, కొద్ది రోజుల క్రితం ఈ విమానానికి రిపేర్లు చేసినట్లు తెలిసింది. ఈ విమానం యూవై ఏవియేషన్ కు చెందిన విమానంగా గుర్తించారు. టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.