ఛత్తీస్గఢ్ కేబినెట్ విస్తరణ.. ఒక మహిళా సహా 9మందికి ఛాన్స్
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ మంత్రివర్గం విస్తరణ మంగళవారం జరిగింది. ఇప్పటికే కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు భూపేశ్ భగల్. తాజాగా మంగళవారం నాడు 9మంది ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో వారు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కొత్త మంత్రులచే ప్రమాణం చేయించారు. తొమ్మిదిమందిలో ఒక మహిళా ఎమ్మెల్యేకు మంత్రిగా అవకాశం కల్పించారు. ప్రమాణ స్వీకారం చేసినవారిలో.. కవాసీ లక్మా, అనిలా బేడియా, జైసింగ్ అగర్వాల్, రుద్ర గురు, రవీంద్ర చౌబే, మహ్మద్ అక్బర్, ఉమేశ్ పటేల్, శివ కుమార్ దహారియా, ప్రేం సాయి సింగ్ తెక్కం ఉన్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. 90 సెగ్మెంట్లకు గాను 68 స్థానాలను కైవసం చేసుకుంది కాంగ్రెస్. 15 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీకి 15 స్థానాల్లో మాత్రమే విజయం లభించింది.
దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈనెల 17న సీఎంగా భూపేశ్ భగల్ తో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సింగ్ దేవ్, తమ్రద్వాజ్ సాహు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం నాడు మరో తొమ్మిది మంత్రులు ప్రమాణస్వీకారం చేయడంతో మంత్రివర్గం సంఖ్య 12కి చేరింది.