ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న తొలిదశ పోలింగ్...దంతెవాడలో నక్సల్స్ దాడి
Recommended Video
ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. తొలి దశలో 18 జిల్లాల్లోని 18 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ స్థానాలన్నీ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. పోలింగ్ కంటే ముందే నక్సల్స్ తమ ఉనికిని చాటుతున్నారు. దంతెవాడ జిల్లాలోని కతెకల్యాణ్లో మావోయిస్టులు బాంబులు పేల్చారు. సీఆర్పీఎఫ్ బలగాలు నయనార్ గ్రామంలోని ఓ పోలింగ్ బూత్కు చేరుకుంటున్న క్రమంలో ఈ బాంబు దాడి జరిగింది. అయితే ఇందులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
10 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం
10 అసెంబ్లీ స్థానాలకు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఈ స్థానాలన్నీ బస్తర్ మరియు రాజ్నందన్గావ్ జిల్లాలో ఉన్నాయి. ఈప్రాంతంలో మావోల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో అధికారులు దాదాపు లక్ష మంది భద్రతా సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాదు పోలింగ్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా హెలికాఫ్టర్ను ఏర్పాటు చేశారు. మిగతా 8 స్థానాలకు గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలి: మోడీ
ఇదిలా ఉంటే ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని... ఓటు హక్కు ఉన్న వారంత వచ్చి తమ ఓటును వేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఓట్ల పండగని చెప్పిన ప్రధాని పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి రావాలని ట్వీట్ చేశారు. ఇక చత్తీస్గఢ్లో మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్లో ఎన్నికల నేపథ్యంలో మావోలు 6 సార్లు దాడి చేయగా అందులో 14 మంది మృతి చెందారు.
2013లో ఈ 18 స్థానాల్లో 12 స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్
ఇక ఈ 18 స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 18 స్థానాలకు గాను 12 స్థానాలను గెలుచుకుంది. ఆ ఎన్నికలకు ఒక నెల ముందు మావోలు చేసిన దాడిలో 25 మంది మృతి చెందారు. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మృతి చెందారు. అయితే ఈ సారి పోటీ బీజేపీ కాంగ్రెస్కే పరిమితం కాలేదు. ఛత్తీస్గఢ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ పార్టీ జనతా కాంగ్రెస్, మాయావతి పార్టీ బీఎస్పీలు ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే అవకాశం ఉందని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు.