ఈవీఎం పూజల వివాదంలో మంత్రి.. పుణ్యం కోసం చేస్తే శాపమొచ్చే..!
ఛత్తీస్ గఢ్ : ఛత్తీస్ గఢ్ లో ఓ మంత్రి చేసిన పని వైరల్ గా మారింది. చేయకూడని చోట పూజలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓట్లు వేయాల్సిన పోలింగ్ బూత్ లో పూజలు చేయడమే కాదు ఈవీఎంకు కొబ్బరికాయ కూడా కొట్టారు. విషయానికొస్తే ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు సెకండ్ ఫేజ్ పోలింగ్ ఈనెల 20న జరిగింది. మంత్రి దయాల్ దాస్ బాఘెల్ తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నవగఢ్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ సెంటర్లో పూజలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.ఈవీఎం పూజల వివాదంలో మంత్రి చిక్కుకోవడంతో పుణ్యం కోసం చేస్తే శాపమొచ్చే..! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మంత్రి పోకడలపై రిటర్నింగ్ అధికారి సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే స్థానిక జిల్లా కలెక్టర్ పోలింగ్ సెంటర్ నెంబర్ సరిగా కనిపించడం లేదంటున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లేనని.. ఆయన పూజలు ఎక్కడ చేశారనే విషయంపై ఆరా తీస్తున్నామని చెబుతున్నారట.
పోలింగ్ సెంటర్లో మంత్రి పూజలు కాంగ్రెస్ నేతలకు అస్త్రంగా మారింది. ప్రజాస్వామ్య దేశంలో ఈవీఎంలకు పూజలు చేయడం కాదని.. ప్రజలను దేవుళ్లుగా భావించాలని ఎద్దేవా చేశారు. అయితే ఈ పూజలపై గానీ, వైరల్ అవుతున్న ఆ వీడియోపై గానీ దయాల్ దాస్ స్పందించకపోవడం గమనార్హం.