పాడు పంచాయితీ: అత్యాచారం చేస్తే రూ.10వేలు జరిమానా విధించి పార్టీ ఇచ్చారు
ఛత్తీస్ఘఢ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఏజెన్సీ ప్రాంతమైన జష్పూర్ జిల్లాలో ముగ్గురి అమ్మాయిలపై కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలకు మైనార్టీ తీరలేదు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతలోనే పంచాయతీ పెద్దలకు విషయం తెలిసింది. వెంటనే పంచాయతీకి రావాల్సిందిగా కబురు పంపారు.
పంచాయతీ పెద్దలు ఏదో న్యాయం చేస్తారన్న ఆశతో తన ముగ్గురు కూతుళ్లతో పాటు తల్లిదండ్రులు కూడా వెళ్లారు. పంచాయతీలో మరో 45 మంది గ్రామపెద్దలు పాల్గొన్నారు. ఇక తీర్పు చెప్పే సమయం వచ్చేసింది. అత్యాచారంకు పాల్పడిన నిందితులు పంచాయతీకి రూ.30వేలు జరిమానా కట్టాల్సిందిగా గ్రామ సర్పంచ్ డిసైడ్ చేశారు. అంటే ఒక్కో అమ్మాయికి రూ.10వేలు అని చెప్పాడు. సర్పంచ్ తీర్పుతో విస్మయానికి గురయ్యాడు అమ్మాయిల తండ్రి. నిందితులు రూ.30వేలు జరిమానా కట్టగానే ఇక ఇరువర్గాల మధ్య రాజీ కుదిరిందంటూ పెద్ద ప్రకటన చేశాడు. అనంతరం వచ్చిన జరిమానా డబ్బుతో గ్రామం అంతటికీ రూ.10వేలతో విందు ఏర్పాటు చేశాడు. మిగతా డబ్బును పంచాయతీ చేసేందుకు వచ్చిన 45 మందికి ఒక్కొక్కరికి రూ.485 ఇచ్చాడు.
న్యాయం చేస్తాడనుకున్న గ్రామపంచాయతీ పెద్దలు తమ కూతుళ్ల శీలానికి రూ.485 వెలకట్టారని కన్నీటి పర్యంతమయ్యాడు తండ్రి. దీంతో బాధిత కుటంబంలో ఒకరు మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని బయటపెట్టారు. ఇది తెలుసుకున్న జాష్పూర్ ఏఎస్పీ ఉనేజా కఠూన్ అన్సారీ గ్రామానికి పోలీసులను పంపి నిందితులను తీసుకురావాల్సిందిగా ఆదేశించారు.
ఇదిలా ఉంటే గ్రామ సర్పంచ్ నారాయణ భగత్ మాత్రం తాను చేసింది కరెక్టేనంటూ సమర్థించుకున్నాడు. అమ్మాయిలూ అబ్బాయిలూ ఇష్టపడే ఆ పనికి పూనుకున్నారని చెప్పాడు. తాము తప్పు చేశామని ఒప్పుకుని అబ్బాయిలు జరిమానా కట్టారని సర్పంచ్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు బాధిత కుటుంబమే తమకు న్యాయం చేయాలని కోరి... వారిచ్చిన డబ్బును తీసుకుని రాజీకొచ్చిందని బుకాయించాడు. సర్పంచ్ అబద్ధాలు చెబుతున్నాడని... జరిమానా రూపంలో వచ్చిన డబ్బుతో గ్రామానికి విందు ఇచ్చాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.