ఆన్ లైన్ కొనుగోళ్లలో మోసపోయారా? ఇదిగో.. ఫిర్యాదు ఇలా...
ఆన్ లైన్ కొనుగోళ్లలో మోసాలు జరిగితే పరిష్కారానికి వీలుగా అంతర్జాల వినియోగదారుల మధ్యవర్తిత్వ కేంద్రం ( ఆన్ లైన్ కన్స్యూమర్ మీడియేషన్ సెంటర్ ఓసీఎంసీ) ఏర్పాటైంది.
బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో నగదు రహిత ( డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ ద్వారా) కొనుగోళ్లు పెరిగాయి. ఇలాంటి లావాదేవీలలో మోసాలు జరిగితే పరిష్కారానికి వీలుగా అంతర్జాల వినియోగదారుల మధ్యవర్తిత్వ కేంద్రం ( ఆన్ లైన్ కన్స్యూమర్ మీడియేషన్ సెంటర్ - ఓసీఎంసీ) ఏర్పాటైంది.
కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో బెంగళూరులోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో గత డిసెంబరు 24న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో ఫిర్యాదు చేసేందుకు వినియోగదారులు రూ.100 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
కొనుగోలుదారులకు త్వరితగతిన పారదర్శక పరిష్కారాన్ని అందించేందుకు దీనిని ప్రారంభించినట్లు ఓసీఎంసీ సంచాలకులు అశోక్ పాటిల్ వెల్లడించారు. అయితే ఇక్కడ పరిష్కారమయ్యే ఫిర్యాదుల వివరాలు బహిర్గతం చేయబోమని ఆయన తెలిపారు.
ఫిర్యాదులు నమోదు చేయాల్సిన వెబ్ సైట్ చిరునామా: onlinemediacenter.ac.in
* అవకతవకలపై ఫిర్యాదు అందినప్పుడు మొదట కొనుగోలుదారు, విక్రయదారుడు పరస్పరం అంతర్జాలంలో సంప్రదించుకుని వివాదం పరిష్కారానికి ప్రోత్సహిస్తారు. దీనికోసం ఓసీఎంసీ వెబ్ సైట్ లో ప్రత్యేక విభాగం ఉంది. ఈ విభాగం ద్వారా కొనుగోలు రసీదు, గ్యారెంటీ పత్రాలు, బిల్లులు తదితరాలు పంపించవచ్చు.
* వారంలోగా వివాదం పరిష్కారం కానిపక్షంలో తటస్థ వ్యక్తిని వివాదపరిష్కర్తగా నియమిస్తారు.
* ఆన్ లైన్ లో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు.. ఒక్కోసారి పార్శిల్ లో సంబంధిత వస్తువు కాకుండా ఇతరత్రా ఏమైనా వస్తుంటాయి. దీనిపై సంబంధిత విక్రయ సంస్థ తగిన విధంగా స్పందించని పక్షంలో తమ వద్ద ఫిర్యాదు చేయవచ్చని ఓసీఎంసీ సంచాలకులు పాటిల్ తెలిపారు.