సీఎం నివాసంలో అస్తిపంజరం? సునీల్ దేవ్ధర్ ట్వీట్.. త్రిపురలో కలకలం!
అగర్తలా: త్రిపుర అభివృద్ధి బాటలో మాజీ సీఎం మాణిక్ సర్కార్ను కలుపుకొని వెళతామంటూనే.. ఆయన్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. త్రిపురలో బీజేపీ గెలుపునకు కారకుడైన సునీల్ దేవ్ధర్ శనివారం ఓ ట్వీట్ బాంబ్ పేల్చారు. ఇది ప్రస్తుతం అక్కడ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
'త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్కు నాదొక విన్నపం.. అధికారిక నివాసాల్లోకి చేరబోయేముందు అక్కడి సెప్టిక్ ట్యాంకులను ఓసారి శ్రుభ్రం చేయించండి. గతంలో మాణిక్ సర్కార్ నివాసంలో మహిళ అస్తిపంజరం లభించిన అనుభవం దృష్ట్యా మీరీ పని తప్పక చెయ్యాలి..' అని దేవ్ధర్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
సీఎం నివాసంలో అస్తిపంజరం?
అగర్తలాలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మాణిక్ సర్కార్1998 నుంచి మొన్నీమధ్య వరకూ ఉన్నారు. 2005 జనవరి 4న ఆ అధికారిక నివాసంలోని సెప్టిక్ ట్యాంకులో ఓ మహిళ అస్తిపంజరం బయటపడింది. అప్పట్లో ఈ ఘటన పెను సంచలనం సృష్టించింది. సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేయడానికి వచ్చిన మున్సిపల్ సిబ్బంది దానిని గుర్తించారు.
13 ఏళ్లు గడుస్తున్నా కొలిక్కిరాని కేసు...
తన అధికారిక నివాసంలోని సెప్టిక్ ట్యాంకులో మహిళ అస్తిపంజరం వెలుగుచూసిన వ్యవహారాన్ని అప్పటి సీఎం మాణిక్ సర్కార్ కూడా సీరియస్గా తీసుకున్నారు. ఆ కేసును ఆయన సీఐడీకి అప్పగించారు. ఆ తర్వాత అది సీబీఐకి బదిలీ అయింది. ఇదంతా జరిగి 13 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆ కేసు ఇంకా కొలిక్కిరాలేదు. దీనిపై ప్రతిపక్షాలు పలు విమర్శలు కురిపించాయి. ‘ఇది మాణిక్ నియంత పాలనకు నిదర్శనమని' సీపీఎం ప్రత్యర్థులు ఆరోపిస్తారు.
ఇంతకీ ఆ అస్తిపంజరం ఎవరిది?
త్రిపుర సీఎం అధికారిక నివాసంలోని సెప్టిక్ ట్యాంకులో అస్తిపంజరంగా కనిపించిన ఆ మహిళ ఎవరనేదానిపై త్రిపురలో భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. నేపాల్కు చెందిన పని అమ్మాయిని.. సీఎం సిబ్బందిలో ఒకరు లేదా కొందరు అత్యాచారం చేసి హతమార్చి ఉంటారని నాటి కాంగ్రెస్ నేత సమీర్ రాజన్ బర్మన్ ఆరోపించారు. ఈ కేసును తొక్కిపెట్టే క్రమంలో మృతురాలి కుటుంబాన్ని బలవంతంగా నేపాల్కు పంపించేశారని కూడా ఆయన పేర్కొన్నారు.
ఆ పుస్తకంలోనూ ఈ వ్యవహారం...
మాణిక్ సర్కార్పై దినేశ్ కాంజీ అనే రచయిత రాసిన ‘మాణిక్ సర్కార్ : ది రియల్ అండ్ వర్చువల్' అనే పుస్తకంలోనూ ఈ అస్తిపంజరం వ్యవహారాన్ని ప్రస్తావించారు. ‘అప్పట్లో జాతీయ స్థాయి మీడియాలో సైతం చర్చనీయాంశమైన ఈ కేసులో బర్మన్(కాంగ్రెస్ నేత) ఆరోపణలను ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది..' అని రచయిత రాసుకొచ్చారు. ఇక దేవ్ధర్ తాజాగా చేసిన ట్వీట్పై సీపీఎం శ్రేణులు ఇంకా స్పందించాల్సి ఉంది. సునీల్ దేవ్ధర్ ‘అస్తి పంజరం' ఉదంతాన్ని కోట్ చేస్తూ ట్వీట్ చేయడం వ్యూహంలో భాగమా? లేక యాదృచ్ఛికమా? అనేది తెలియాల్సిఉంది.