ప్రశాంత్ కిషోర్కు చెక్.. జేడీయూకు జోడు పదవులు.. బీహార్లో బీజేపీ వ్యూహం ఇదేనా?
ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన అల్టిమేటం బీజేపీ పై బాగా పని చేసిందా ? ఒక పక్క కేంద్ర సర్కార్ నిర్ణయం అయిన ఎన్నార్సీ, సీఏఏ లను వ్యతిరేకిస్తున్నా బీజేపీ జేడీయూ తో బంధాన్ని మరింత బలపురుచుకునే వ్యూహం దేని కోసం ? మిత్రపక్షమైన జేడీయూ కూడా గుడ్ బై చెప్పకుండా బీజేపీ వేసిన ప్లాన్ పీకేకి షాక్ ఇచ్చిందా? బీహార్ లో అసెంబ్లీ పోరుకు సమయం దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
పీకే వ్యూహానికి చెక్ పెట్టే ప్లాన్ లో బీజేపీ
దేశవ్యాప్తంగా రగులుతున్న ఎన్నార్సీ మంటలు బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాయి. ఇప్పటికే బీజేపీకి మిత్ర పక్షాలుగా ఉన్న పలు రాజకీయ పార్టీలు బీజేపీకి గుడ్ బై చెప్తే రానున్న కాలంలో బీజేపీకి మరో మిత్రపక్షం అయిన జేడీయూ కూడా గుడ్బై చెప్పే అవకాశాలు కనిపించటంతో బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న జేడీయూ బీజేపీ పట్ల కాస్త ప్రతికూల వైఖరిని ప్రదర్శిస్తున్నా బీజేపీ మాత్రం బుజ్జగింపుకు రంగం సిద్ధం చేసింది.. తాజాగా ప్రశాంత్ కిషోర్ బీజేపీకి అల్టిమేటం జారీ చెయ్యటంతో ఖంగు తిన్న బీజేపీ ఇప్పుడు పీకే వ్యూహానికి చెక్ పెట్టే పనిలో పావులు కదుపుతుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాలపై పీకే వ్యాఖ్యల ఎఫెక్ట్
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకి కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతో కేంద్రంపై నితీష్ ఇప్పటికే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు . ఇక ఇదే సమయంలో తాజాగా ఎన్ఆర్సీ విషయంలో కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు సింహభాగం సీట్లు రానున్న ఎన్నికల్లో జేడీయూకి కావాలని జేడీయూ ఉపాధ్యక్షుడు , రాజకీయ వ్యూహకర్త పీకే చేసిన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు సీట్ల ఒప్పందంపై బీజేపీ నేతలు మరోసారి పునపరిశీలన చేసుకోవాలని ప్రశాంత్ కిశోర్ సూచించారు. అలాగే 1:4 ఫార్మూలాను పీకే తెరపైకి తీసుకువచ్చారు.
రెండు మంత్రి పదవుల ఆఫర్ అందుకే
ఈ నేపధ్యంలో వెంటనే తేరుకున్న మోదీ, షాలు నష్టనివారణమొదలు పెట్టారు.జేడీయూని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇద్దరికి కేబినెట్లో చోటు దక్కనుందని సమాచారం.శుక్ర, శనివారాల్లో వారుమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో నితీష్ ను బుజ్జగించే వ్యూహంలో భాగంగా, పీకే చెప్పిన ఫార్ములా వర్కవుట్ కాకుండా చేసే ఎత్తుగడతో బీజేపీ ఈ ప్లాన్ చేసినట్టు సమాచారం.
బీజేపీ వ్యూహం అసెంబ్లీ ఎన్నికల్లో ఫలిస్తుందా .. పీకే చెప్పిందే జరుగుతుందా ..
రెండు మంత్రి పదవులు ఇచ్చి జేడీయూని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తాయా ? సీట్ల పంపకాల విషయంలో ఇప్పటికే 50: 50 ఫార్ములాకు చాన్సే లేదని సింహభాగం తమకే కావాలని పీకే చెప్పిన మాటలకే నితీష్ కట్టుబడతారా అనేది తెలియాల్సి ఉంది. బీహార్ లో ఎన్నార్సీ ఆందోళనల నేపధ్యంలో ఆయన బిహార్లో ఎన్ఆర్సీ అమలు చేసే ప్రసక్తే లేదని బహిరంగంగానే ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో పీకే సీట్ల పంపకాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి.