జే న్యూస్ చానల్ ప్రారంభం, జే అంటే జయం, జయా టీవీ కథ క్లోజ్, చిన్నమ్మ అంతు చూస్తాం!
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, జయలలిత ఆశయాల గురించి ప్రజలకు వివరించడానికి అన్నాడీఎంకే పార్టీ అధికారికంగా జే న్యూస్ చానల్ ను ప్రారంభించింది. తమిళనాడు ప్రభుత్వం మీద చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని జే న్యూస్ చానల్ ద్వారా తిప్పికొడతామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళ వర్గాన్ని హెచ్చరించారు.
పళని, పన్నీర్ హ్యాండ్
చెన్నైలో బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జే న్యూస్ చానల్ ను అధికారికంగా ప్రారంభించారు. రెండు నెలల క్రితం జే న్యూస్ చానల్ లోగోను పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఆవిష్కరించారు. అప్పటి నుంచి తాత్కాలికంగా జే న్యూస్ చానల్ ప్రసారాలు ప్రసారం చేస్తున్నారు. టెక్నాలజీ పరంగంగా ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా సరిచూసుకుని బుధవారం నుంచి అధికారికంగా జే న్యూస్ చానల్ ప్రసారం చేస్తున్నారు.
ముగ్గురు ఆదర్శం
జే న్యూస్ చానల్ ప్రారంభం సందర్బంగా సీఎం పళనిస్వామి మాట్లాడుతూ ద్రవిడ ఉద్యమకారుడు సీఎన్ అన్నాదురై ఆశయాలు, అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆశీస్సులతో నేడు జే న్యూస్ చానల్ ప్రారంభించామని అన్నారు. ఎలాంటి తప్పుడు సమాచారం జే న్యూస్ చానల్ లో ప్రసారం కాదని, ప్రజలను తప్పుదోవ పట్టించే పని మాత్రం తాము చెయ్యమని అన్నారు.
జయలలితకు వెన్నుపోటు
అన్నాడీఎంకే పార్టీ ప్రచారం కోసం, పార్టీ కార్యకర్తల కోసం 1988లో జయలలిత జయా టీవీ, నమదు ఎంజీర్ దిన పత్రికను ప్రారంభించారని పళనిస్వామి, పన్నీర్ సెల్వం గుర్తు చేశారు. అయితే జయా టీవీ, నమదు ఎంజీఆర్ దిన పత్రికల్లో శశికళ, టీటీవీ దినకరన్ కుటుంబ సభ్యులు వారి స్వార్థం కోసం అన్నాడీఎంకేకి వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేసి కార్యకర్తలను వేధింపులకు గురి చేశారని, జయలలితకు వెన్నుపోటు పోడిచారని పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఆరోపించారు.
జే అంటే జయం
జయలలిత ప్రారంభించిన జయా టీవీ, నమదు ఎంజీఆర్ దిన పత్రికను దొడ్డిదారిలో స్వాధీనం చేసుకున్న శశికళ కుటుంబ సభ్యులు అన్నాడీఎంకే పార్టీని నాశనం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆరోపించారు. శశికళ కుటుంబ సభ్యలు ఆట కట్టించడానికి జే న్యూస్ చానల్ ప్రారంభించామని పన్నీర్ సెల్వం అన్నారు. జే అంటే జయం అని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు దగ్గర అయ్యే విధంగా ప్రసారాలు ఉంటాయని పన్నీర్ సెల్వం అన్నారు.
శశికళ ఫ్యామిలీ డబ్బు, పవర్!
శశికళ ఫ్యామిలీ పవర్, డబ్బు ప్రభావం తమ మీద పడదని, మన్నార్ గుడి మాఫియాకు కాలం చెల్లిపోయిందని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు. జే న్యూస్ చానల్ తో పాటు అన్నాడీఎంకే పార్టీకి చెందిన నమదు పురుచ్చి తలైవి దినపత్రికతో అన్నాడీఎం పార్టీని శాస్వతంగా కాపాడుకుంటామని అన్నాడీఎంకే పార్టీ నాయకులు చెబుతున్నారు.