చెన్నై పేలుడు: టెక్కీ స్వాతిని దురదృష్టం వెంటాడింది
హైదరాబాద్: చెన్నైలో బెంగళూర్ - గౌహతి ఎక్స్ప్రెస్ రైలులో సంభవించిన బాంబు పేలుడులో మరణించిన టెక్కీ స్వాతిని దురదృష్టం వెంటాడింది. టిసిఎస్లో ఉద్యోగం చేస్తున్న స్వాతి తన ఇంటికి తిరిగి వస్తూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో స్వాతి విజయవాడకు బెంగళూర్ - గౌహతి ఎక్స్ప్రెస్ రైల్లో తత్కాల్ కింద టికెట్ బుక్ చేసుకుంది. ఈ మేరకు మీడియాలో శుక్రవారం వార్తలు వచ్చాయి.
దానికితోడు, తన సహోద్యోగిని, మిత్రురాలు రజితతో స్వాతి సీటు మార్చుకుంది. రజిత కూడా అదే రైలులో ఆమెతో పాటు బుధవారం రాత్రి ప్రయాణం చేసింది. నిజానికి నేరుగా మరో రైలులో గుంటూరుకు రావాలని స్వాతి అనుకుంది. కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకుని బెంగళూర్ - గౌహతి ఎక్స్ప్రెస్ రైలులో ఎక్కింది.
రాత్రి స్వాతి అప్పర్ బెర్త్ మీద పడుకోగా, రజిత కింది బెర్త్ మీద పడుకుంది. గురువారం ఉదయం అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించిందని, ప్రయాణికులు ఆందోళనతో అటూ ఇటూ పరిగెత్తడం ప్రారంభించారని, ఏం జరుగుతుందో తెలిసే లోగానే తనను ఎవరో రైలు నుంచి బయటకు లాగారని రజిత ఓ పత్రికతో చెప్పింది.
తాను స్వాతిని పిలిచానని, కానీ ఆమె కదలలేదని, స్వాతికి ఏం జరిగిందో కూడా తెలియలేదని, ప్రయాణికులు పరుగెత్తుతూ ఉండడంతో తీవ్రమైన గందరగోళం చోటు చేసుకుందని రజిత చెప్పింది. ప్రస్తుతం రజిత తీవ్ర దిగ్భ్రాంతి లోనైంది.