3 కేజీ బంగారు లూటీ: రాజస్థాన్ లో చెన్నై పోలీసు అధికారిని కాల్చి చంపేశారు!
Recommended Video
చెన్నై: దోపిడీ దొంగలను పట్టుకోవడానికి వెళ్లిన తమిళనాడు పోలీసు అధికారిని కాల్చి చంపిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని మదురవాలయం పోలీస్ స్టేషన్ లో ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్న పెరియపాండిని దుండగులు కాల్చి చంపారు.
దుండగుల కాల్పుల్లో చెన్నై నగరంలోని కోలత్తూరు పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ మునిశేఖర్ కు తీవ్రగాయాలై రాజస్థాన్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చెన్నైలోని కోలత్తూరులోని ఓ బంగారు నగల దుకాణంలో ఇటీవల సినిమా ఫక్కీలో దాదాపు మూడు కేజీల బంగారు నగలు లూటీ చేశారు.
జ్యూవలరీ షాప్ లో బంగారు నగలు లూటీ చేసిన దుండగులు రాజస్థాన్ లో ఉన్నారని తమిళనాడు పోలీసులకు సమాచారం అందింది. పోలీస్ ఇన్స్ పెక్టర్ లు పెరియపాండి, మునిశేఖర్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకుని దుండగులను పట్టుకోవడానికి కొన్ని రోజలు క్రితం రాజస్థాన్ వెళ్లారు.
రాజస్థాన్ లోని పాలి జిల్లాలో దోపిడీ దొంగలు ఉన్న ప్రాంతాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. బుధవారం దోపిడీ దొంగలు ఉన్న ప్రాంతాన్ని తమిళనాడు పోలీసులు చుట్టుముట్టారు. ఆ సందర్బంలో విషయం పసిగట్టిన దోపిడీ దొంగలు పోలీసుల మీద కాల్పులు జరిపి పారిపోయారు.
దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో బుల్లెట్లు దూసుకెళ్లి ఇన్స్ పెక్టర్ పెరియపాండి సంఘటనా స్థలంలో మరణించారు. మరో ఇన్స్ పెక్టర్ మునిశేఖర్ కు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇన్స్ పెక్టర్ పెరియపాండి చెన్నైలోని ఆవడి ప్రాంతంలో భార్య, ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇన్స్ పెక్టర్ పెరియపాండి ఎదురు కాల్పుల్లో మరణించాడని తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు.