జయలలిత పోయెస్ గార్డెన్ లో కలెక్టర్, ఐటీ శాఖ, సీఎం పళని, పన్నీర్ ప్లాన్, శశికళకు !
Recommended Video
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంను అమ్మ మెమోరియల్ భవనం చెయ్యడానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. తమిళనాడు ప్రజలు కలకాలం జయలలితను గుర్తు పెట్టుకోవడానికి అమ్మ నివాసం ఉన్న వేదనిలయాన్ని మెమోరియల్ చేస్తామని ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారు.
పన్నీర్ సెల్వం పట్టు
జయలలిత నివాసం ఉన్న పోయెస్ గార్డెన్ లోని వేదనిలయాన్ని అమ్మ గుర్తు కోసం మెమోరియల్ చెయ్యాలని పళనిస్వామి వర్గంతో విలీనం అయ్యే సమయంలో పన్నీర్ సెల్వం షరతులు పెట్టారు. పన్నీర్ సెల్వం షరతులను సీఎం ఎడప్పాడి పళనిస్వామి అప్పట్లోనే అంగీకరించారు.
శశికళ ఫ్యామిలీ గుప్పిట్లో !
శశికళ నటరాజన్ సోదరుడు జయరామన్ కుమారుడు, జయా టీవీ సీఇవో వివేక్, అతని సోదరి క్రిష్ణప్రియ ఆధీనంలో పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం ఉంది. ఇటీవల ఐటీ శాఖ దాడులు జరిగిన సమయంలో వివేక్ నుంచి వేదనిలయం తాళాలను ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైకోర్టుకు దీపా, దీపక్ !
మా మేనత్త జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయానికి తామే వారసులు అంటూ అమ్మ మేనకోడలు దీపా, మేనల్లుడు దీపక్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ ఇంకా కొనసాగుతోంది.
కలెక్టర్, రెవెన్యూ, ఐటీ శాఖ
తమిళనాడు ప్రభుత్వం ఆదేశాల మేరకు రెండు రోజలు క్రితం పోయెస్ గార్డెన్ ను అధికారులు పరిశీలించారు. శనివారం చెన్నై కలెక్టర్, రెవెన్యూ శాఖ, పీడబ్లుడీ శాఖ, ఆదాయపన్ను శాఖ అధికారులు పోయెస్ గార్డెన్ లోని వేదనిలయాన్ని అధికారికంగా పరిశీలించారు.
వేదనిలయం ఆస్తి విలువ ?
జయలలితకు చెందిన వేదనిలయాన్ని శనివారం అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. వేదనిలయం భవనం, చుట్టుపక్కల భూమి ఎంత ఉంది ? ప్రస్తుత మార్కెట్ లో ఆస్తి విలువ ఎంత ?, భవనం ఎన్ని చదరపు అడుగుల్లో నిర్మించారు అనే పూర్తి సమాచారాన్ని కలెక్టర్ సమక్షంలో రెవెన్యూ శాఖ అధికారులు కొలతలు వేసి పూర్తి వివరాలు సేకరించారు.
దీపా, దీపక్ కు పరిహారం !
జయలలితకు చెందిన వేదనిలయం మాకే చెందాలని హైకోర్టుకు వెళ్లిన అమ్మ మేనకోడలు దీపా, మేనల్లుడు దీపక్ తో రాజీ కావాలని సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం నిర్ణయించారని తెలిసింది. వేదనిలయం ఆస్తి విలువ ఎంత ఉందో అంత విలువైన భూమిని (ఆస్తి) దీపా, దీపక్ ఇవ్వాలని పళనిస్వామి, పన్నీర్ సెల్వం నిర్ణయించారని సమాచారం.
భారీ బందోబస్తు
శశికళ కుటుంబ సభ్యులు, ఇతరులు వేదనిలయంలోకి ప్రవేశించకుండా తమిళనాడు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. 500 మందికి పైగా పోలీసులు వేదనిలయం దగ్గర 24 గంటలు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.