ఆసియాలోనే మొట్టమొదటిసారి... చెన్నైలో కరోనా సర్వైవర్కు విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి....
ఆసియాలోనే మొట్టమొదటిసారిగా ఓ కరోనా సర్వైవర్కు చెన్నై వైద్యులు విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చేశారు. వైరస్ బారినపడ్డ తర్వాత అతని ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో సర్జరీ ద్వారా వాటిని తొలగించారు. ఆ స్థానంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి దానమిచ్చిన ఊపిరితిత్తులను అమర్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. తమ వైద్య బృందం ప్రాణాలను రిస్క్ చేసి మరీ ఈ సర్జరీ చేసినట్లు ఎంజీఎం హెల్త్ కేర్ చైర్మన్ డా.కేఆర్ బాలకృష్ణన్ వెల్లడించారు.
వైద్యులు ఏమంటున్నారు...
డా.కేఆర్ బాలకృష్ణన్ మాట్లాడుతూ... గురుగ్రామ్కి చెందిన ఓ వ్యాపారవేత్త(48)కు ఈ సర్జరీ చేసినట్లు తెలిపారు. గత జూన్ 8న అతను కోవిడ్ 19 బారినపడ్డాడని... వైరస్ కారణంగా అతని ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. గత జులైలో అతన్ని గురుగ్రామ్ నుంచి చెన్నైకి విమానంలో వెంటిలేటర్ సపోర్టుతో తీసుకొచ్చి ECMO చికిత్స అందించినట్లు చెప్పారు. ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీ కోసం తమ వైద్య బృందం ఒకరకంగా తమ ప్రాణాలను రిస్క్ చేసిందన్నారు. అయితే అప్పటికే ఆ పేషెంట్ కోవిడ్ 19 నుంచి కోలుకున్నాడని తెలిపారు.
నిలకడగా అతని ఆరోగ్య పరిస్థితి..
ప్రస్తుతం అతని రెండు ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయని... ECMO సపోర్ట్ కూడా తొలగించామని ఎంజీఎం హెల్త్ కేర్ కో డైరెక్టర్ డా.సురేష్ రావు చెప్పారు. అతని వైద్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. చెన్నై గ్లెన్ ఈగల్స్ గ్లోబల్ ఆస్పత్రికి చెందిన ఓ బ్రెయిన్ డెడ్ పేషెంట్ తన ఊపిరితిత్తులను దానం చేసినట్లు చెప్పారు. అతని గుండెను కూడా మరొకరికి దానం చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకూ భారత్లో 62వేల మంది కరోనాతో చనిపోగా... ఇందులో చాలామంది ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్న తర్వాతే చికిత్స కోసం వెళ్లినవారున్నారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో వాళ్లలో చాలామంది మృతి చెందారు.కోవిడ్ 19 నుంచి బయటపడినప్పటికీ... ఆ తర్వాత కొంతమందిలో లంగ్ ఫైబ్రోసిస్,కార్డియోవస్క్యులర్ సమస్యలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
అమెరికాలో గతంలోనే...
గత జులైలో అమెరికాలోని చికాగోలో ఓ కరోనా పేషెంట్కు భారత సంతతి వైద్యుడు అంకిత్ భరత్ నేతృత్వంలోని వైద్య బృందం విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసింది. వైరస్ కారణంగా 60ఏళ్ల ఆ పేషెంట్ ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో ఈ సర్జరీ నిర్వహించారు. ఇందుకోసం దాదాపు 10 గంటలు శ్రమించారు. లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్లో నిపుణుడైన అంకిత్ అంతకుముందు కూడా ఇలాంటి సర్జరీలు చాలానే చేశారు.